Suryaa.co.in

Andhra Pradesh

నేను కట్టానని పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేశాడు

– ప్రాజెక్ట్ పరిశీలించి జగన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు
– సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ఫేజ్-1 పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
మూర్ఖత్వంతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు

“అధికారంలోకి వచ్చిన వెంటనే పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తాం. నేను వచ్చిన వెంటనే వడ్డీతో సహా మీ రుణం తీర్చుకుంటాను. పురుషోత్తమపట్నానికి అటువైపు పట్టిసీమ ఉంది. పోలవరం ప్రధాన కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమతో కృష్ణాడెల్టాకు గోదావరి నీళ్లు అందించాం. శ్రీశైలంలో నిల్వచేసిన మిగులు కృష్ణాజలాలను రాయలసీమకు తరలించాం. పురుషోత్తమపట్నం లిఫ్ట్ ద్వారా ఏలేరుకు నీటిని తరలించి, ఆ నీటిని విశాఖపట్నానికి తరలించాలని ఆలోచించాం.

పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ద్వారా 2లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఆలోచించాం. ఆనాడు భూములిచ్చిన వారికి న్యాయంచేశాను. అప్పుడు నేను ఇచ్చిన పరిహారం చాలదని, అంతఇస్తాను..ఇంతఇస్తాను అనిచెప్పి, రైతుల్ని రెచ్చగొట్టిన పెద్దమనిషి ముఖ్యమంత్రి అయ్యాక మీకు కనిపించలేదు. పరిహారం ఇవ్వలేదు. పోలవరం నిర్వాసితుల్ని కూడా ఇదేమాదిరి మోసగించాడు. ఇదీ అతని విశ్వసనీయత.

అబద్ధాలకోరు, కరుడుగట్టిన నేరస్తుడు, మూర్ఖుడు, సైకో అందరి జీవితాలు నాశనం చేశాడు. ఈ రోజు నేను రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తమ పట్నం వచ్చాను. ఈ రోడ్లపై వచ్చేసరికి నా నడుం విరిగిపోయింది. రోడ్లు బాగుచేయలేని ఈ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని బాగుచేసి, మీ భవిష్యత్ కాపాడతాడా?

ఇతని మాటలు కోటలు దాటతాయి..చేతలు మాత్రం గడపకూడా దాటవు. పురుషోత్తమపట్నం బంగారం లాంటి ప్రాజెక్ట్. అదిచేసుకున్న పాపం ఏమిటంటే నేను కట్టడం, అందుకే దాన్ని ఈ ముఖ్య మంత్రి గాలికి వదిలేశాడు. ఇతను ఎంత మూర్ఖుడు అంటే నేనుకట్టాను కాబట్టి, దాన్ని వాడకూడదు.

పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ను కూడా ప్రజావేదిక మాదిరే కూల్చేసేవాడు. ఆ పనిచేస్తే మీరు ఊరుకోరని ఆగాడు. ప్రాజెక్ట్ మిషన్లు ఆన్ చేస్తే నేరుగా పొలాలకు నీళ్లు వెళతాయి. అదికూడా చేయడానికి ఈ మూర్ఖుడికి ఇష్టం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పురుషోత్తమపట్నాన్ని ఒక టూరిజం హబ్ గా మారుస్తాను. ఇక్కడకొత్తగా రోడ్లువేసి రూపురేఖలు మారుస్తాను.

ఈ దుర్మార్గుడు వచ్చాక మనరాష్ట్రంలో ఆయకట్టు సాగు తగ్గింది. ఇక్కడొక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు. పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ కు భూము లిచ్చినవారికి న్యాయం చేయలేని జగన్ రెడ్డిని ప్రశ్నించలేడు.

ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండటానికే అనర్హుడు. ఇతన్ని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి మోక్షం.” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE