-ఆ వార్తలను కార్యకర్తలెవరూ పట్టించుకోవడం లేదు
-బీజేపీని బలహీనం చేసేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర
-ఈటలకు భద్రత కల్పించాల్సిందే….
-దాడి అనుమానితులను అరెస్ట్ చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలి
-పార్టీ బలోపేతం కోసమే ఈనెల 8న 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటనా మంత్రుల సమావేశం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
-సికింద్రాబాద్ చేరుకున్న ‘‘విస్తారక్ ’’లకు స్వాగతం పలికిన బండి సంజయ్
‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని మీరు టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు… ఆ నిప్పు లేదు.. పొగ లేదు.. ఇదంతా కేసీఆర్ లాంటి మూర్ఖుడు చేస్తున్న కుట్ర. సొంత పార్టీ సంగతిని పక్కన పెట్టి పక్క పార్టీల్లో పొగపెట్టాలని చూస్తున్నరు. మా కార్యకర్తలెవరూ వీటిని పట్టించుకోవడం లేదు’’ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పించి కేంద్ర మంత్రిగా నియమించబోతున్నారంటూ ఓ ఛానల్ లో వచ్చిన వార్తపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి.
‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రేల్వే స్టేషన్ కు చేరుకున్న ‘‘విస్తారక్’’ లకు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పసహా పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…
పోలింగ్ బూత్ ల వారీగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అల్పకాలిక విస్తారక్ లను నియమించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి 650 మంది విస్తారక్ లు ఈరోజు తెలంగాణకు వచ్చారు. వీరికి సికింద్రాబాద్ తోపాటు మంచిర్యాల, ఖాజీపేట స్టేషన్లలో స్వాగతం పలికి అన్ని మండలాలకు పంపిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పూర్తితో వీరంతా తెలంగాణలోని మండలాల వారీగా పర్యటించి పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమవుతారు.
రాష్ట్ర అధ్యక్ష మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు…. జేపీ నడ్డాను అడిగి చెబుతా… అయినా నాయకత్వ మార్పుపై తరుణ్ చుగ్ సహా మా పార్టీ జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు వార్తలు పదేపదే రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు కూడా అలవాటైనట్లుంది. అయినా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని మీరు టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు… ఆ నిప్పు లేదు.. పొగ రాలేదు..
కేసీఆర్ లాంటి మూర్ఖుడు సొంత పార్టీని పక్కన పెట్టి పక్క పార్టీల్లో పొగపెట్టాలని చూస్తున్నరు. డబ్బు, అధికార మదంతో విర్రవీగుతూ ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే నన్ను మారుస్తున్నారంటూ దుష్ర్పచారం చేస్తున్నారు. మేం అవన్నీ పట్టించుకోం. జేపీ నడ్డా ఆదేశానుసారం పనిచేస్తాం.
ఈటల రాజేందర్ పై హత్యకు కుట్ర, భద్రతపై అడిగిన ప్రశ్నకు…. ఆయనపై హత్యకు కుట్ర చేసిన వారిపై తక్షణమే విచారణ జరపడంతోపాటు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటు గతంలో మాపై దాడులు చేసిన వాళ్లను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టి ఉల్టా మమ్ముల్నే జైల్లో పెట్టారు. ఇప్పటికైనా దోషులను, అనుమానితులను అరెస్ట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలి. అదే సమయంలో ఈటల రాజేందర్ కు కచ్చితంగా తగిన భద్రత కల్పించాల్సిందే.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటన మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దక్షిణాది, సమీప రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్ష, సంఘటన మంత్రుల సమావేశం హైదరాబాద్ లో ఈనెల 8న సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు. కచ్చితంగా జులై నెలలో రాష్ట్రంలో పర్యటిస్తారు.