– ప్రజల సొమ్ము బాబుకు పరమాన్నం..!
– విదేశీప్రయాణాలకు రూ.100 కోట్లు.. నవ నిర్మాణదీక్షలకు రూ.80 కోట్లు
– ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుచేసి నీతులా..?
– జగన్ ప్రజల సొమ్మును పైసా కూడా వృథా చేయలేదు
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుచేసి నీతులా..?
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లండన్ పర్యటన గురించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నీ మాదిరిగా వందల కోట్ల ప్రజల సొమ్ముతో సోకులు పోయి, విలాసాలు, దుబారా చేయలేదని తెలుసుకో చంద్రబాబు. నీకు ప్రజాధనమంటే పరమాన్నం లెక్క. అధికారంలో ఉన్నప్పుడు, నీ విదేశీ ప్రయాణాలకు, రాష్ట్రంలో తిరగడానికి బుల్లెట్ప్రూఫ్ బస్సు పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశావు.
ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చేముందు సీఎం కార్యాలయం పేరుతో.. లేక్వ్యూ గెస్ట్హౌస్ మరమ్మత్తులకు రూ.10 కోట్లు.. సీఎం కార్యాలయానికి మరో రూ.10 కోట్లు ఖర్చుచేశావు. నీ విదేశీ ప్రయాణాలకు స్పెషల్ ఫ్లైట్లు వాడి, మొత్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేశావు. అలాగే ఆనాడు బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు చేసిన ధర్మపోరాట దీక్షకు, నవనిర్మాణ దీక్షలకు.. రూ.80 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్మును వెచ్చించావు. ఇవన్నీ ప్రజాధనం కాదా చంద్రబాబు..? అని అడుగుతున్నాను. ప్రజల డబ్బును నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిన నీచుడివి నువ్వు. అలాంటి నువ్వా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను.
ప్రభుత్వ సంక్షేమం పేరిట రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నేరుగా లబ్ధిని చేకూర్చిన మహోన్నత ముఖ్యమంత్రి మా జగన్. మరి, నువ్వెందుకు ప్రజలకు మేలు చేసే అలాంటి బటన్ నొక్కలేకపోయావని అడుగుతున్నాను.
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి షాపూర్జీ పల్లంజీ, ఎల్అండ్టీ కంపెనీల నుంచి రూ.118 కోట్లు ముడుపులు కొట్టేసింది చంద్రబాబు కాదా..? అని అడుగుతున్నాను. ఆ సొమ్ముకు సంబంధించిన లెక్కలు చెప్పాలని ఐటీశాఖ నోటీసులు జారీచేస్తే.. మేము వాటిపై నిలదీస్తుంటే.. నన్ను అరెస్టు చేయడానికి చూస్తున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ప్రజల సొమ్మును దోచుకున్న చంద్రబాబును ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందే. జైల్లో పెట్టాల్సిందే. చట్టబద్ధమైన విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాను.
చంద్రబాబు, లోకేశ్ మీద ఈగ వాలనీయకుండా, చీమ చిటుక్కుమంటే గంగవెర్రులెత్తి మాట్లాడే దత్తపుత్రుడు ఏమయ్యాడు..? ఐటీశాఖ నోటీసులపై జాతీయ మీడియా సైతం పెద్ద ఎత్తున కథనాలు రాస్తుంటే, ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి పవన్కళ్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నాడు..? సీపీఐ నారాయణ, రామకృష్ణ నోరుమెదపకుండా ఏం చేస్తున్నట్లు..? ఈనాడు రామోజీరావు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉలుకుపలుకూ లేకుండా ఉండటానికి కారణమేంటి..? అని అడుగుతున్నాను. ఆయన దోచుకున్న ముడుపుల్లో మీకూ వాటాలందాయా..? అని ప్రశ్నిస్తున్నాను.
ఈ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ మాదిరిగా, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తామంటే కుదరదు. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా తిన్న మీ తండ్రీ-కొడుకులు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందేనని గుర్తుచేస్తున్నాను.