Suryaa.co.in

Telangana

రాజీవ్ లేకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు

– లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడు
– అధికారం పోయినా మదం దిగలేదు
– రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా..మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే
– ఎవడ్రా తొలగించేది… ఎవడొస్తాడో చూస్తా..
– సన్నాసులకు మహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుంది?
– డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం
– ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి.
– సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఇది రాజకీయ వేదిక కాదు.ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. కానీ కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడేవారికి, ఈ వేదికగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలచుకున్నా. అడ్డగోలుగా వేలకోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలచుకున్నా.

దేశ స్వాతంత్ర్యం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. దేశ స్వాతంత్య్రం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబం.563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూది. మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది సెహ్రూ కాదా?.

ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్ కు పునాదులు వేసిన ఘనత నెహ్రూది.నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు సెహ్రూ మనకు అందించిన సంపద. కొంతమంది సన్నాసులు వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరా గాంధీ ఏ పదవి తీసుకోలేదు. ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారు.బ్యాంకుల జాతీయకరణ చేసి పేదల అభివృద్ధికి కృషి చేశారు.రాజభరణాలు రద్దు చేసి ఘనత ఇందిరాగాంధీ గారిది.దళిత,గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టిన ఘనత ఇందిరమ్మది.

పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, పేదలకు సొంతింటి కలను నిజాం చేసింది ఇందిరమ్మ కాదా? లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ కాదా? దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసిన త్యాగశీలి ఇందిరమ్మ.

దేశానికి నాయకత్వ సమస్య వచ్చినపుడు దేశ ప్రజల కోసం ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు.దేశ భవిత యువత చేతుల్లో ఉండాలని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ కాదా? రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీది కాదా? స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాదా? ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది రాజీవ్ కాదా?

ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని సన్నాసులకు, మహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుంది.? దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే… కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వాడు. లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడు.. రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారు.వాళ్లకు అధికారం పోయినా మదం దిగలేదు.

రాజీవ్ గాంధీ మరణించినా సోనియమ్మ ఏ పదవీ తీసుకోలేదు.2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదు.ప్రాణ త్యాగం అంటే ఇందిరా, రాజీవ్ లది.పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలది. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.

దుర్మార్గుల్లా పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, పదవులు పంచుకున్న వాళ్లా కుటుంబ పాలన గురించి మాట్లాడేది? గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పింది. ఐలమ్మ స్పూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా.. మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే.. అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు.

వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టు కున్న మీకు ,తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? మేం రాజీవ్ విగ్రహం పెడతామనాగానే, వీళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందట. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సముచితం కాదా అని తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు.

ఎవడ్రా తొలగించేది… ఎవడొస్తాడో చూస్తా.. పదేళ్లు మీకు సోయి లేదు కాబట్టే… మేం సచివాలయంలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సచివాలయంలో, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చూపిస్తాం. డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉంటుందని రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తున్నాం.

ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే, చివరి చూపుకు కూడా వెళ్లని దుర్మార్గుడు కేసీఆర్. కానీ మేం IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టాం. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించాం.

కేసీఆర్ అధికారం పోయిందన్న అక్కసుతో ఉంది. అందుకే కొంతమంది చిల్లరగాళ్లను మనపైకి ఉసిగొల్పుతున్నారు. కాలకేయ ముఠా మిడతల దండుగా మారి, తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్లమీదకు రాబోతోంది. తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కండి. ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి.

LEAVE A RESPONSE