-100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి నెంబర్ 1 కావడానికి అర్హతలు ఉన్న దేశం భారత్
-నేషన్ ఫస్ట్ అనేది అందరి నినాదం కావాలి
– టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
-గుంటూరు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
అమరావతి:- భారత దేశం రానున్న 25 ఏళ్లకు ప్రత్యేకమైన విజన్ తో ప్రయాణం చేస్తే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మారుతుందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ మేటి దేశంగా నిలవడానికి భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి ఇంకా 25 ఏళ్లు ఉందని…ఈ సమయం ప్రత్యేక మైనదని అన్నారు. విజన్- 2047 రూపొందించుకుని దేశం ప్రయాణం చేస్తే ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలోకి వస్తుందని అన్నారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా చంద్రబాబు గుంటూరు లోని చేబ్రోలు హనుమయ్య కంపనీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రాణ త్యాగాలు చేసిన స్వాంతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. వారికి నివాళులు అర్పించారు. అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు కన్నెగంటి సీతారామయ్య దంపతులను చంద్రబాబు సత్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలి…. ప్రతి ఒక్కరి మదిలో జాతీయ భావం రావాలి అని చంద్రబాబు అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి, సర్థార్ పటేల్, నేతాజీ వంటి జాతీయ నేతలను స్మరించుకుందాం. జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్యను ప్రత్యేకంగా స్మరించుకోవాలి అన్నారు. 400 ఏళ్ల క్రితం నాగరికతలో భారత దేశం ఎంతో ముందుఉండేది…అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఉంది…అయితే వలస పాలనలో భారత దేశం తరువాత తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు అన్నారు.
ఆకలి బాధలు, కరువు కాటకాలతో దేశం అల్లాడిందని…అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పరిస్థితి మారిందని చంద్రబాబు అన్నారు. నెహ్రూ, పివి, వాజ్ పేయి, మోదీ వంటి వారు దేశాన్ని ముందుకు నడిపించారు. స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తరవాత దేశం ఎలా ఉంది అనేది చూడాలి…అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణ తరువాత అని చూడాలి. నాడు పివి నరసింహారావు తీసుకున్న సంస్కరణలతో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతుంది. తరువాత కాలంలో దేశం ప్రబల శక్తిగా మారింది. ప్రతి ఒక్కరు నేషన్ ఫస్ట్ అని ఆలోచించాలి. దాని కోసం పాటుపడాలి. వ్యక్తుల కంటే దేశం మిన్న అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి అని చంద్రబాబు అన్నారు.
హరిత విప్లవం, పాల విప్లవంతో దేశ గమనం మారిపోయింది…..కరవు కాటకాల నుంచి ప్రపంచానికి ఆహారం పెట్టే దేశంగా భారత్ మారింది. కరోనాకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చే దేశంగా అవతరించింది. కరోనా అన్ని రంగాలను కుదిపేసింది….కానీ అప్పుడు కూడా పని చేసింది రైతులు మాత్రమే అని ఆయన అన్నారు. దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టిడిపి భాగస్వామిగా ఉంది. దీనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. విజన్ 2020తో నాడే టిడిపి లక్ష్యాలను నిర్థేశించుకుని పని చేసింది.
తెలుగు దేశం ప్రాంతీయ పార్టీ అయినా….జాతీయ పార్టీ గా పనిచేసింది. టెలీ కమ్యూనికేషన్ సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటులో టిడిపి ప్రభుత్వం జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించింది అని చంద్రబాబు అన్నారు. నేడు మనం తీసుకునే నిర్ణయాలు భావి తరాలపైనా….ప్రజల అభివృద్ది పైనా ప్రభావం చూపుతాయి అని చంద్రబాబు అన్నారు. మేకిన్ ఇండియాలో రక్షణ రంగ వస్తువుల తయారీలో 35 నుంచి 70 శాతానికి వెళ్లాం…ఇది 100 శాతానికి రావాలి అన్నారు. ఇలాంటివి చూసినప్పుడు మనకు గర్వకారణం అన్నారు.
ఇకపోతే రానున్న 25 ఏళ్లకు ఏమి చెయ్యాలి అనేది నేడు ఆలోచించాలి అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన ప్రణాళికతో, లక్ష్యంతో పని చెయ్యాలి అని ఆయన సూచించారు. ఇప్పటికీ పేదరికం ఉంది…రైతులు ఆత్మహత్యలు ఉన్నాయి…నిరుద్యో సమస్యలు ఉన్నాయి. వీటిపై ఆలోచన చెయ్యాలి అన్నారు. ప్రతి ఒక్కరు నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని కాదు….నేను ఏమి ఇచ్చాను అనేది ఆలోచించాలి. అదే సమరయోధులకు ఇచ్చిన నిజమైన నివాళి అవుతుంది అన్నారు. రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలి. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలి అని చంద్రబాబు సూచించారు.
1. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి.
2. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి.
3. బలమైన యువశక్తి ఉన్న దేశం ఇండియా. యువకు అవకాశాలు కల్పించాలి.
4. దేశంలో సంపద సృష్టి జరగాలి…ఆ సంపదను పేద ప్రజలకు పంచాలి.
5. రైతుల కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకురావాలి. 75 ఏళ్ల తరువాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు.
6. విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి.
7. మహిళా సాధికారత కు ప్రణాళికలు అమలు చెయ్యాలి.
8. దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలి. ఎపిలో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేశాం. కరవు రహిత దేశం కోసం నదుల అనుసంధానం జరగాలి.
9. అవినీతి లేని పాలనను అందించాలి. టెక్నాలజీ ద్వారా అవినీతిని అంతం చెయ్యాలి.
10. ప్రపంచంలో 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్ అవతరించడానికి ప్రణాళికలు రచించాలి. అన్ని అర్హతలు, వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం కావాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో, ప్రణాళికతో పని చేసి దీన్ని సుసాధ్యం చెయ్యాలని తాను కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.