Suryaa.co.in

Andhra Pradesh

జ‌గ‌న్ స‌ర్కారు కంచే గంజాయి చేనుకి కాపలా కాస్తోందా?

– జ‌గ‌న్ వ‌చ్చాక గంజాయి వ‌నాలు ధ్వంసం నిలిపేశారు
– తోట‌ల ధ్వంసానికి నిధులివ్వ‌క‌ విప‌రీతంగా సాగ‌యిన గంజాయి
– ఆందోళ‌న వ్య‌క్తం చేసిన టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

జ‌గ‌న్ స‌ర్కారు గంజాయి వ‌నాల‌కు కంచెలా మారి కాప‌లా కాస్తోంద‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. గంజాయి వ‌నాలు ధ్వంసానికి ప్ర‌తి ఏటా కేటాయించే నిధులు, జ‌గ‌న్ వ‌చ్చాక విడుద‌ల చేయ‌క‌పోవడాన్ని ప్ర‌శ్నిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఏపీలో విచ్చ‌ల‌విడిగా గంజాయి, డ్ర‌గ్స్ వాడ‌కం పెరిగిపోయింద‌న్నారు. దేశ‌వ్యాప్తంగా ప‌ట్టుబ‌డుతున్న గంజాయి ఏపీ నుంచి ర‌వాణా అవుతోంద‌ని..క‌ట్ట‌డి చేయాల్సిన స‌ర్కారే చేష్ట‌లుడిగి చూడ‌టం అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. ఏ ప్ర‌భుత్వం ఉన్నా ప్ర‌తి ఏటా డిసెంబ‌ర్ నెల‌లో ఆంధ్ర ఒరిస్సా బోర్డరులో ఏపుగా పెరిగిన గంజాయి తోట‌లు ధ్వంసం చేయిస్తాయ‌ని, దీని కోసం నిధులు కూడా కేటాయిస్తాయ‌ని పేర్కొన్నారు. పోలీస్,ఎక్సైజ్, రెవిన్యూ, మైనింగ్, ఇతర శాఖల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ఒడిశా ప్ర‌భుత్వ స‌హ‌కారం కూడా తీసుకుని, కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టి మ‌రీ ప్ర‌తి ఏటా గంజాయి తోట‌ల‌ను డిసెంబ‌రు నెల‌లో ధ్వంసం చేస్తారని తెలిపారు.

దీని కోసం అవ‌స‌ర‌మ‌య్యే నిధులు ప్ర‌తి నెల డిసెంబ‌ర్ నెలలోనే బ‌డ్జెట్ కేటాయించి గంజాయి తోట‌ల ధ్వంసం ఆప‌రేష‌న్ చేప‌డ‌తార‌ని వివ‌రించారు. తెలుగు దేశం ప్రభుత్వం హ‌యాంలో ఐదేళ్ల‌పాటు ఇలాగే గంజాయి తోట‌ల‌ను పెద్ద ఎత్తున ధ్వంసం చేశామ‌న్నారు. వైకాపా ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఐదేళ్లు పూర్త‌యినా, ఒక్క ఏడాది కూడా డిసెంబ‌ర్ నెల‌లో బ‌డ్జెట్ కేటాయింపు జ‌ర‌ప‌లేద‌ని, గంజాయి తోట‌ల ధ్వంసం ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌లేద‌ని, క‌నీసం దీనిపై సంబంధిత శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష కూడా చేయ‌లేద‌ని లోకేష్ వెల్ల‌డించారు.

ఏపీ డ్ర‌గ్స్ హ‌బ్‌గా మారిపోయినా, గంజాయి గుప్పుమంటున్నా..జ‌గ‌న్ స‌ర్కారు గంజాయి తోట‌ల ధ్వంసాన్ని ఆపేయ‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. ఏపి ని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశారని, ఇతర రాష్ట్రాలకి గంజాయి తరలింపు లో ప్రధాన పాత్ర వైకాపా నాయకులదేనని ఆరోపించారు. వైకాపా గంజాయి మాఫియా ఒత్తిడితోనే డిసెంబ‌రు నెల‌లో జ‌ర‌గాల్సిన గంజాయి తోట‌ల ధ్వంసం ప్ర‌క్రియ నిలిపేశార‌నే ఆరోప‌ణ‌ల‌కి జ‌గ‌న్ స‌ర్కారు స‌మాధానం చెప్పాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE