– అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలనుకుంటే సిబిఐకి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు
– బోల్ట్ వేసి రక్తపు మరకలను తుడిచివేసినందుకే ఇచ్చిన బెయిల్ రద్దు చేయగా… అదే కేసులో మరో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇస్తారా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయాలనుకుంటే సి.బి.ఐ కి ఎటువంటి ప్రతిబంధకాలు లేవని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉండగా, అరెస్టు చేయకూడదని ఆర్డర్లో ఎక్కడ లేదు. అరెస్టు చేసుకుంటే, చేసుకోవచ్చునని ఇప్పటికే న్యాయస్థానం తన ఉత్తర్వులలో పేర్కొంది. హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు వాదనలు ముగిసినప్పటికీ, తీర్పు మాత్రం జూన్ మొదటి వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయన్నారు . హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కేసు ఈ రోజైనా తేలుతుందా?, లేదా అన్న ఉత్కంఠ గత రెండు మూడు రోజులుగా కొనసాగుతోందన్నారు.
శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…వైయస్ అవినాష్ రెడ్డి గురువారం సాయంత్రం విడుదల చేసిన వీడియో సంచలనాత్మకంగా మారింది. వీడియోలో అవినాష్ రెడ్డి పేర్కొన్న అంశాలకు సాక్షి దినపత్రిక అధిక ప్రాధాన్యతను ఇచ్చి వార్తా కథనాన్ని ప్రచురించింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా లో ప్రత్యేక విమానాలలో తిరిగే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి శవాన్ని సందర్శించడానికి వాహనంలో ఆలస్యంగా వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వైయస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ పై గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రఘు రామకృష్ణంరాజు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఇద్దరిలో ఉత్తమ నటులు ఎవరో, ఆస్కార్ అవార్డు ఎవరికి లభిస్తుందో చెప్పాలంటూ ఆయన చమత్కరించారు. వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ గురించి ఇప్పుడు కాకి గోల చేస్తున్న అవినాష్ రెడ్డి, ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరించిన రామ్ సింగ్ పై అభియోగాలను చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేసింది. తరువాత సిట్ కు అభిషేక్ మహంతి నేతృత్వం వహించారు. అభిషేక్ మహంతి తప్పుకున్న తర్వాత, హన్బు రాజన్ కూడా సిట్ అధికారిగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, డాక్టర్ సునీత సిబిఐ దర్యాప్తు కోసం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో, సిబిఐ విచారణ చేపట్టగా, తొలుత విచారణ అధికారిగా దీపక్ గౌర్ వ్యవహరించారు. ఇలా నాలుగు సిట్ ల ముందు కూడా వైయస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ గురించి పెద్దగా ప్రస్తావించని వారు , ఇప్పుడు పదే, పదే అదే లేఖ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన అనంతరం ఇనాయతుల్లా అనే వ్యక్తి ఆయన ఫోటోలను తీసి, డాక్టర్ వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి కి పంపించారు. ఫోటోలను చూసిన రాజశేఖర్ రెడ్డి, వై ఎస్ వివేకానంద రెడ్డి లేఖ రాసే అవకాశమే లేదని భావించి, లేఖను దగ్గర పెట్టుకోవాలని కృష్ణారెడ్డికి సూచించారు.
అయితే అప్పటికే లచ్చమ్మ కుటుంబానికి కృష్ణా రెడ్డి కోవర్ట్ గా మారారు. కృష్ణారెడ్డి అందజేసిన లేఖను రాజశేఖర్ రెడ్డి వెంటనే ఎస్పీకి అందజేయడం జరిగింది. ఎవరైనా చంపిన వాడిని పక్కనే పెట్టుకుని లెటర్ రాస్తారా?. బెడ్ రూమ్ లో లెటర్ రాసి వైయస్ వివేకానంద రెడ్డి, బాత్రూమ్ లోకి వెళ్లి చనిపోయారా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. హత్య ప్రదేశంలో లేఖ తో పాటు, ఫోను కూడా లభించిందని చెబుతున్నారు. అటువంటప్పుడు లేఖ రాయకుండా, ఫోను చేసి చెప్పే అవకాశం ఉంది కదా. ఈ చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు. లేఖ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వారు లెటర్ రాయడం కష్టమా?, ఫోన్ చేయడం కష్టమా అన్నది చెప్పాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని అందరూ చెబుతుండడం వల్ల, అవినాష్ రెడ్డి కూడా గుండెపోటుతో మరణించారని చెప్పినట్లుగా ఆయన తరుపు న్యాయవాది వాదనలు వినిపించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు .
కేసు తేలడానికి రెండేళ్లు పట్టే అవకాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తేలడానికి రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా ఎన్నికలు వస్తే అవినాష్ ను, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్యాయంగా కేసులోకి లాగారని ప్రజలను మభ్య పెట్టే విధంగా సాక్షి రాతలు ఉన్నాయి. ఈపాటికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి నోటీసులు అంది ఉండాలి.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ స్వీకరించిన తర్వాత, వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు నివేదించగా అత్యంత ఒత్తిడిలో ఆయన లేఖ రాశారని వెల్లడించడం జరిగింది. వివేకానంద రెడ్డితో తాము బలవంతంగా లేఖ రాయించామని హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న దస్తగిరి కూడా చెప్పారు. హత్య కేసులో లభించిన ఆధారాలతో దస్తగిరి వాంగ్మూలం సరిపోయింది. అయినా దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఈ కేసులో గూగుల్ టేక్ అవుట్ ఒక ఆధారం. లేని దాన్ని పట్టుకొని వైయస్ బ్రదర్స్ మాట్లాడుతున్నారు. హత్య చేసిన రాజశేఖర్ రెడ్డి కాపాడుకునేందుకు సునీతమ్మ ప్రయత్నిస్తున్నారని అవినాష్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నుంచి విచారణ అధికారిగా రామ్ సింగ్ ను మార్చాలని ఢిల్లీ వీధులలో తిరిగారు. రామ్ సింగ్ ను విచారణ అధికారిగా మార్చి, వికాస్ సింగ్ ను నియమించిన తరువాతే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. విచారణ అధికారిని మార్చినంత మాత్రాన, సిచువేషన్ మారదు. తండ్రి అరెస్టు అనంతరం కంగారుపడి వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా, 15 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం కేసు కొట్టివేయడం జరిగింది. ఈ కేసు లో సిబిఐ ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు కితాబును ఇచ్చింది. అయినా, సుప్రీంకోర్టులో తులసమ్మ తో పిటిషన్ వేయించి, కేసు విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేశారు. తండ్రిని అరెస్టు చేసిన వారు కుమారుణ్ణి అరెస్టు చేయలేదు. అంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గ్రహించారు. సుప్రీం కోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు. అలాగే హైకోర్టులో కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు లేదు. ఒకవేళ చేసి ఉంటే మీడియాలో కథనాలు వచ్చి ఉండేవి. న్యాయస్థానాలలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోయినప్పటికీ, వాదనలను మాత్రం సిబిఐ మనస్ఫూర్తిగానే వినిపిస్తోంది. అయితే సిబిఐ వైఖరిని చూస్తే అరెస్టు చేస్తుందని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సిబిఐ తన వైఖరిని ఎందుకు మార్చుకుందో అర్థం కావడం లేదన్నారు.
తీర్పు ఇస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి
హైకోర్టు లో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇస్తే, పిటిషన్ డిస్మిస్ చేయాలి. ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు మృగ్యం. కర్ర విరగకూడదు పాము చావకూడదన్నట్టు గా వాదనలు పూర్తయిన, తీర్పు వాయిదా వేసే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ జస్టిస్ సుమలత అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తో పాటు వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తలుపు మూసి బోల్ట్ వేసి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన ప్రదేశంలో రక్తపు మరకలను తుడిచారని సి ఐ శంకరయ్య వెల్లడించినట్లుగా సిబిఐ పేర్కొంది. గతంలో ఎర్ర గంగిరెడ్డి కి డిపాల్ట్ బెయిల్ మంజూరు చేయగా, సాక్షాలను తారుమారు చేసినట్టు ఆధారాలు ఉన్న కారణంగా ఆయన బెయిల్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. జూన్ 30వ తేదీ నాటికి చార్జి షీట్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, జూన్ 30వ తేదీ తర్వాత లక్షన్నర పూచీ కతు తో బెయిల్ ఇవ్వవచ్చునని ధర్మాసనం వెల్లడించింది. బోల్ట్ వేసి రక్తపు మరకలను తుడిచిన నిందితుడికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసిన ధర్మాసనం , అదే కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా?.
ఎర్ర గంగిరెడ్డి కి బెయిల్ రద్దు చేసిన బెంచ్ లో అయితే, ముందస్తు బెయిల్ నిరాకరించేవారు. నిందితుడి గా అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇచ్చిన బెయిల్ ను కేసు విచారణ సవ్యంగా జరగడానికి రద్దు చేసినప్పుడు, అదే కేసులో నిందితుడుగా చేర్చబడిన వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యమేనా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన తీరు గురించి దస్తగిరి కాకుండా, జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎవరో చెప్పి ఉంటారు. అందుకే ఆయన మీడియా ముందు హత్య జరిగిన తీరును వివరించారు. ఈ కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేయడం ఖాయం. దస్తగిరి అబద్ధం చెప్పారని అంటున్నారు. దస్తగిరి చెప్పిందే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సాక్షి దినపత్రికలో సుప్రీం కోర్ట్, అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేసిన వార్త రాయదు . షర్మిల చెప్పింది కూడా రాయరు. కానీ అవినాష్ రెడ్డి తరఫున నిరంజన్ రెడ్డి వినిపించిన వాదనల గురించి మాత్రం రాస్తారని రఘు రామకృష్ణంరాజు అన్నారు.
కేసు తీవ్రతను బట్టి ముందస్తు బెయిల్ పై నిర్ణయం
కేసు తీవ్రతను బట్టి ముందస్తు బెయిల్ బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలి. తనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ ద్రోహం, దేశద్రోహం కేసును నమోదు చేసింది. ఈ కేసును తీవ్రవాదులపై, టెర్రరిస్టులపై నమోదు చేస్తారు. చెట్టు కింద కూర్చుని నాలుగు మంచి మాటలు చెప్పే వారిపై రాజ ద్రోహం కేసు నమోదు చేయరు. అయినా, తనపై నమోదు చేసిన రాజ ద్రోహం కేసులో నిజా నిజాలను తెలుసుకొని తనకు బెయిలు మంజూరు చేయడం జరిగింది. హత్య కేసులో పూర్తి ఆధారాలున్నా నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరీ కి అవకాశాలు లేవు. కోర్టు, కోర్టుకు తీర్పు మార్పు ఏమిటని బొబ్బిలి పులి సినిమాలో ఎన్టీ రామారావు ప్రశ్నించగా, అదే కోర్టులో కోర్టు రూము, రూముకు తీర్పులో మార్పు ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో చివరి మాసమైన ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఒక్క అమెరికాలోనే 50 నుంచి 60 కేంద్రాలలో శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహించే మహనీయుడైన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో మరో మహానుభావుడు రజినీకాంత్ పాల్గొననున్నారు. చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు విజయవంతం కావాలని రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు.