కళ్లులేని విద్యార్ధిని కన్నీటికథ ఇది

– శోక సంద్రంలో అంధ విద్యార్థులు
– పది పబ్లిక్ పరీక్షలకు అనుమతి నిరాకరించిన అధికారులు

ఆ విద్యార్థినికి కళ్లు లేవు. అయితేనేం? బోలెడంత ఆత్మస్థైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే ఆమె పదవ తరగతి పరీక్షకు సిద్ధపడింది. హాల్‌టికెట్ తీసుకుని వెళ్లిన ఆ బాలికకు, ఆదిలోనే అడ్డంకి ఎదురయింది. ఆమెను పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. కారణం అంధత్వం. అదే ఇప్పుడు ఆమెకు శాపమయింది. పరీక్షకు అనుమతించాలని, కాళ్లమీద పడ్డా కనికరించని అధికారులు కనీసం.. అంధులు మరొకరితో పరీక్ష రాయించుకునే అవకాశం ఉందన్న విషయాన్నీ మర్చిపోయారు. అప్పటికే పరీక్ష ప్రారంభమయింది. దానితో నిరాశగా ఇంటిముఖం పడుతున్న, తోటి విద్యార్ధిని కన్నీటి కష్టం చూసి విద్యార్ధులు చలించిపోయారు. నంద్యాల గుడ్ షెప్పర్డ్ స్కూల్‌లో ద్రాక్షాయణి కన్నీటి కథ ఇది.

రెండు కళ్లు లేని భాలిక విద్యాభ్యాసంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తమ మార్కులతో నెట్టుకు వచ్చింది. అంధత్వం ఆ బాలిక లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేక పోయింది.రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అనుమతినిస్తూ హాల్ టిక్కెట్ సైతం జారీ చేయడంతో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అలవోకగా మంచి మార్కులతో గట్టెక్కుతానని దృఢ సంకల్పంతో ఉన్న అంద బాలికకు, బుధవారం ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికారులు అనుమతి నిరాకరించడంతో బాలిక ఆశలు ఒక్కసారిగా అడియాశలు అయ్యాయి.

ఆ బాలిక మనోవేదన వర్ణనాతీతంగా మారింది. విద్యా శాఖ మరియు పరీక్షల విభాగానికి చెందిన అధికారులను ఎంత ప్రాధేయపడినా పబ్లిక్ పరీక్ష కు అనుమతి ఇవ్వకపోవడం పట్ల శోక సంద్రంలో మునిగిన సంఘటన నంద్యాల జిల్లా పట్టణ కేంద్రం లో బుధవారం చోటుచేసుకున్నది.

నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె సాయిబాబా నగర్ కు చెందిన మల్లారి ద్రాక్షయని అనే అంద బాలిక పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను వ్రాసేందుకు గుడ్ షెఫర్డ్ స్కూల్ పరీక్ష కేంద్రానికి వెళ్ళింది,
అయితే విద్యాశాఖ మరియు పరీక్షల విభాగానికి చెందిన అధికారులు అంధ విద్యార్థిని ని పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించడంతో ఒక్కసారిగా డీలా పడిపోయింది.

ఎంత ప్రాధేయపడినా ఎంత మొరపెట్టుకున్నా కనికరించడం లేదని అంద బాలిక యొక్క బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షలు రాసే అంద విద్యార్థినీ విద్యార్థులు తొమ్మిదవ తరగతి విద్యార్థులతో తను ఆన్సర్ లు చెపుతూ పరీక్షలు రాయించుకునే వెసలుబాటు ఉన్నది.

అయితే ఎక్కడ లోపం ఏర్పడిందో గాని, రెండు కళ్ళు లేని బాలిక యొక్క పదవ తరగతి పబ్లిక్ పరీక్ష రాయాల్సిన మొదటి రోజే ఆశనిపాతంల శరాఘాతం ఎదురయ్యింది. అంధ బాలిక మానసిక ఆవేదన రోదన వర్ణనాతీతంగా మారడం తో పరీక్షా కేంద్రం వద్ద ఉన్నటువంటి పలువురు హృదయాలను కలచి వేసింది.

Leave a Reply