Suryaa.co.in

Telangana

బుచ్చమ్మది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య!

– హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు
– కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకో రేవంత్
– వెంటనే ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
– ఎవరికోసం ఈ మూసీ సుందరీకరణ? ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు?
-మాజీ మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌: కూకట్పల్లి నియోజకవర్గం నల్లచెరువు బఫర్ జోన్ లో ఉన్న బుచ్చమ్మ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక, ఇల్లు ఎప్పుడు కూలగోడతారో తెలువక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుందని, ఇప్పటికే హైడ్రా పేరిట మూడు ఆత్మహత్యలు జరిగాయి. రేవంత్ రెడ్డి ని నేను అడుగుతున్నాను… ఇంకా ఎంతమందిని చంపదలుచుకున్నారు? అని.. బుచ్చమ్మ ది ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ మార్చురీకి శనివారం మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు వెళ్ళారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మీడియాతో ఏమన్నారంటే… ఇది కేవలం రేవంత్ రెడ్డి చర్యల వల్ల జరిగిన హత్య. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. గాంధీ హాస్పిటల్ లో చిన్న చిన్న మందులు లేక పారాసిట్ మల్ లాంటి గోలీలు కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ హాస్టళ్లలో, స్కూళ్లలో పురుగుల అన్నం పెట్టి వేధిస్తున్నారు.

హైదరాబాద్ ని నిలబెట్టే పని చెయ్యి. కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకో. హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తాం. గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వ ఆదాయంలో నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారు. 30 ఏళ్ల నుండి నివాసాలు ఏర్పరచుకున్న వారిని కూల్చే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పేదలను నిర్వాసితులను చేస్తే ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలి. జీవన భృతి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. ఉపాధి పోయి, ఇల్లు పోయి రోడ్డు మీదకు వస్తున్నారు ప్రజలు. నష్ట పరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. నష్టపరిహారం, ఉపాధి కల్పించిన తర్వాత వారిని ఒప్పించిన తర్వాతనే నిర్మాణాలను కూలగొట్టాలి. ముఖ్యమంత్రిగా ప్రజలకు సహాయం చేస్తావా? లేక పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా?

ఇప్పటికైనా పిచ్చి పనులు మార్చుకో రేవంత్ రెడ్డి. వెంటనే ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి. బాధితులు ఆందోళన చెందవద్దు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జీవించి పోరాడాలి… పోరాడి సాధించాలి. ఉన్నదాంట్లో అందరికి మంచి చేయాలి. పేదల కన్నీళ్లు మనకు వద్దు. ఎవరికోసం ఈ మూసీ సుందరీకరణ? ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు. హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. రంగనాథ్ పేదవాళ్ల ఇళ్లను రాత్రికి రాత్రి కూల్చివేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరునికి నెల రోజుల ముందు పర్మిషన్ తెచ్చుకునే అవకాశం కల్పించారు. పేదవారి ఇండ్లను ఎందుకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. పేదవారికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి సోదరులకు ఒక న్యాయమా? పేదలు కోర్టుకి వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరులు లాగానే అందరికి నోటీసులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు మానుకోవాలి.

LEAVE A RESPONSE