• కాపు యువత రాజకీయ కుట్రలో భాగం కావొద్దని విజ్ఞప్తి..
• కాపు సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం 1,200 కోట్లు..
• వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో మూడేళ్లలోనే రూ.32,296 కోట్ల కాపు సంక్షేమం..
• గత ప్రభుత్వ హాయాంలో ‘విదేశీ విద్య’లో అక్రమాలపై ‘విజిలెన్స్ ఎంక్వైరీ’ నివేదిక సిద్ధం, త్వరలో చర్యలు..
• కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి వెల్లడి
రాష్ట్రంలో సమగ్ర, సత్వర, సమాన అభివృద్ధి జరగాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి (శేషు) తెలిపారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ.. కాపుల కోసం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకంతో పాటు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన రియల్ హీరో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అని కొనియాడారు.
కొంతమంది నాయకులు ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని, కాపు యువత వారి రాజకీయ కుట్రల్లో భాగం కావొద్దని విజ్ఞప్తి చేశారు. తాజా పరిస్థితుల్లో కాపులందరూ సంయమనం పాటించాలని కోరారు. తాడేపల్లిలో కాపు కార్పోరేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వివిధ పథకాల క్రింద 70,94,881 మంది కాపు సోదరులకు రూ.32,296.37 కోట్లు (డీబీటీ + నాన్-డీబీటీ)గా లబ్ధిని అందజేశామని తెలిపారు. వీటిలో 57,69,237 మందికి రూ.16,256.44 కోట్లు డీబీటీ ద్వారా అందజేయగా, 13,25,644 మందికి రూ.16,039.93 కోట్లను నాన్-డీబీటీ క్రింద సాయం అందజేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ‘కాపు భవన్’ నిర్మించేందుకు సుమారు 50 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపారు.
ఇప్పటికే అనంతపురం, నెల్లూరు, వైజాగ్ లో కాపు భవన్ లు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే కోవిడ్ మహామ్మారి ప్రపంచాన్ని గడగడలాడిందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా కాలంలో భయభ్రాంతులకు గురయ్యాయని ఛైర్మన్ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ‘నవరత్నాలు’ పథకాల ద్వారా అందజేసిన ఆర్థిక చేయూతతోనే పేద ప్రజలు జీవించిన పరిస్థితులున్నాయన్నారు.
ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో, చేస్తున్న మంచి కార్యక్రమాలతో రానున్న రోజుల్లో కూడా జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని భావించి కొందరు రాజకీయ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ ఒక్కరూ వేలెత్తి చూపే పరిస్థితులు లేవని.. ప్రతిపక్షాలు కావాలనే కులాలు, ప్రాంతాల ప్రస్తావన పదే పదే తీసుకొచ్చి కుట్రలు చేస్తున్నాయా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.
2014 నుండి 2017 వరకూ కాపు కార్పోరేషన్ కు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కాపు సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.1200 కోట్లు మాత్రమేనని తెలిపారు. మరి ఇప్పుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హాయాంలో కాపునేస్తం ద్వారా సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 2,500 కోట్లు కేటాయించి, అమలు చేస్తున్నది ఈ ప్రభుత్వమే అన్నారు.
మెరిట్ స్టూడెంట్స్, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకానికి 110 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ విభాగం నివేదికలు అందాయని, తదుపరి చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. కాపులందరూ ముఖ్యమంత్రి జగన్ కు తోడ్పాటు ఇవ్వాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు కోరారు.