Suryaa.co.in

Political News

జ’గన్’ జీ… పార్టీలో ఏంటీ పబ్జీ..!?

ఇలా ఆరోపణలకు గురవుతున్న మంత్రులను..ఎంపిలను వెనకేసుకు వస్తూ వై ఎస్ ఆర్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తనకు.. తన పార్టీకి మేలు చేసుకుంటున్నారా.. కీడు తెచ్చుకుంటున్నారా..!? అయినా ఇవేమి వైపరీత్యాలు..ఇదే వైఎస్సార్ పార్టీకి ఒరిజినల్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇలాగే నాయకులపై ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలు కోకొల్లలు.. అయితే వాటిలో అధికం ఆర్థిక సంబంధమైనవే.. కుంభకోణాలు..స్కాములు… ఆర్థిక నేరాలు..ఇదిగో ఇలా అప్పుడప్పుడు సెక్స్ స్కాండల్స్.. ఆరోపణలు వచ్చినప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయా వ్యక్తులపై ఏదో రకమైన చర్యలు ఉండేవి.. ఆ వివరాల్లోకి వెళ్తే అదో చాట భారతమే అవుతుంది.. కొండొకచో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల కొమ్ము కాచిన ఫలితమే ఒక రకంగా ఇప్పుడు ఇందిరమ్మ పార్టీ అనుభవిస్తున్న దుస్థితి..!

ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్సార్ పార్టీలో త్రీ కీస్! పూర్తిగా ఆడవారికి సంబంధించిన ఆరోపణలే ఎదుర్కొన్న ఇద్దరు శాసనసభ్యులు (ఒకరు మంత్రి.. మరొకరు మాజీ)తాజాగా ఎంపి.. ఈ ముగ్గురిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారు తప్పు చేయలేదని..పైగా అవన్నీ ప్రతిపక్షం కుట్రలని తమ మీద బురదను వేరే వారిపై తోసేసే ప్రయత్నం చెయ్యడం వైసిపి మరీ జనంలో పలచన అయిపోయే పరిస్థితికి దారి తీస్తోంది..!

ఇప్పటికే అధినేతపై కేసుల వ్యవహారం..ఏది ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి..అప్పుల భారం… ప్రభుత్వ ఆస్తుల తనఖా.. జీతాలు సైతం ఇచ్చుకోలేనంత దుర్భర దీనావస్థ..ఉద్యోగుల పింఛను అకౌంట్ల నుండే గాక..అందిన ప్రతి ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేస్తున్న దా’రుణ’ పరిస్థితి.. ఉద్యోగుల్లో పెరిగిపోయిన అసంతృప్తి..ఎటూ తేలని వివేకా హత్య కేసు.. ఆ ఉదంతంలో సాక్షాత్తు అధినేతవైపై చూపుతున్న వేళ్ళు..ఇవన్నీ వైసిపికి వ్యతిరేక అంశాలే..మరోవైపు సర్పంచులు.. ఎంపిటిసిలు మొదలుకుని ఎమ్మేల్యేలు.. ఎంపిల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు..నోరు మెదపని అధినేత వైనం.. వీటికి పరాకాష్ట మొన్న ఎంపి ఉదంతం..దానిపై పార్లమెంటు స్థాయి వరకు వెల్లువెత్తిన నిరసన..అయినా వినిపించని పెద్దాయన గళం..

ఈ వ్యవహారంలో వైసిపి గాని..సదరు ఎంపి గాని కరెక్టుగానే ప్రవర్తించారని ఎవరైనా అనగలరా..? ఆ చాన్సే లేదు..తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ప్రశాంత్ కిశోర్ చేత సర్వే చేయించినా తప్పు అనే మాటే వినిపిస్తుంది.అంతగా బద్నాం అయిపోయింది ఈ త్రీ..కీస్ వ్యవహారంలో వైసిపి ప్రతిష్ట..! గతంలో సినిమా నటుడు పృధ్వీ టిటిడి ఛానల్ చైర్మన్ గా ఉన్నపుడు ఒక ఉద్యోగిని పట్ల ఆయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తినంతనే పదవీచ్యుతుడిని చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ త్రీ…కీస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఎంతవరకు సమంజసం.

ముఖ్యంగా మొన్న ఎంపి వ్యవహారంలో ఆయన తప్పే లేదన్నట్టు సాగిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది.ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు మా వాళ్ళు ఏం చేసినా పర్లేదు.. నేనున్నాను.. నేను చూసుకుంటాను అనే చందాన ఉందనే వ్యాఖ్యానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఈ తరహా వ్యవహార శైలి మరింత మందికి ఊతమిచ్చినట్టు అవుతుందనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. అందునా తనకు ఏదో క్లీన్ చిట్ వచ్చేసినట్టు సదరు ఎంపి బోర విరుచుకు తిరగడం మరీ విడ్డూరం.

ఇదే…ఇదే..వైసిపి సంస్కృతి అని పార్టీ మొత్తానికి..
ప్రధానంగా అధినేతకు చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి..
ఎన్నో మైనస్ ల నడుమ ప్రజలు ఇంకా వైసిపి పట్ల సానుభూతితోనే ఉన్నారు.
అయితే ఈ తరహా విపరీత పోకడలు మాత్రం ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులకు దారి తీయవచ్చు..ఇది అధినేతకే చెడ్డ పేరు..మరి జగన్మోహన రెడ్డి ఇప్పటికైనా ఈ తరహా పోకడలపై కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని జరగకుండా అడ్డుకట్ట వేయాల్సిన తక్షణ అవసరం ఉంది..!.

– ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్

LEAVE A RESPONSE