Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల స్టంట్ లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే మిగిలిన పనులు పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా?
రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ 5 ఏళ్లల్లో రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేశారు
హంద్రీ నీవా నీళ్లు తేలేని దరిద్రుడు జగన్
ఆర్ ఆర్ కన్ స్ట్రక్షన్ నుంచి డబ్బులు పీఎల్ కంపెనీకి వెళ్లాయి
గ్రీన్ హౌస్, పాలీ హౌసీ అంటే జగన్ రెడ్డికి తెలుసా?
కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు
తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

కుప్పంలో జగన్ రెడ్డి అబద్దాలు, అసత్యాలతో బడాయి ప్రకటనలు చేస్తున్నాడు. కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. 672 కి.మీ. హంద్రీ నీవా పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? 13 శాతం పెండింగ్ పనులు చేయడానికి 57 నెలల కాలం పట్టిందా? కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద రూ.30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెబుతున్నావా? కుప్పం బ్రాంచ్ కెనాల్ చంద్రబాబు హయాంలో 87 శాతం పనులు పూర్తి చేస్తే మిగిలిన పనులు పూర్తి చేయలేని దద్దమ్మ జగన్ రెడ్డి. రూ.3వేల కోట్లకు ఖర్చు చేసి అవుకు టన్నల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు.

చంద్రబాబు నాయుడుని తిట్టాలనే ఉద్దేశ్యంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 57 నెలలు పక్కనపెట్టారు. పనులు చేసిన కాంట్రాక్టర్, ఏజెన్సీలపై కక్షపూరితంగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా హంద్రీనీవా కాలువకు నీళ్లు తేవడం చేతగాక, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తాగటానికి హంద్రీ నీవా నీళ్లు తేలేని దరిద్రుడు జగన్. పరదాలు కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి, జనాలు బయటకు వెళ్లకుండా పోలీసులను అడ్డం పెట్టే ముఖ్యమంత్రి, బహిరంగ సభల పేరుతో బస్సులు వాడుకుంటూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదు. మూడు లిఫ్ట్ ల్లో రెండు లిఫ్ట్ లు టీడీపీ హాయంలో పనులు పూర్తి అయ్యాయి. మూడో లిఫ్ట్ పనులు చేయడానికి 57 పనులు పట్టిందా? ఆర్ ఆర్ కన్ స్ట్రక్షన్ నుంచి డబ్బులు పీఎల్ కంపెనీకి వెళ్లాయి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి భాగోతంతో పనులు అటకెక్కించారు.

5 ఏళ్ల టీడీపీ హయాంలో రూ.68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి 32 లక్షల ఆయకట్టు స్థిరీకరించాం, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు ఇచ్చాం. ప్రతి చివరి ఆయకట్టుకు నీరిందించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.35,471 కోట్లల్లో రూ.10,365 కోట్లు జీతభత్యాలు, పెండింగ్ బిల్లులు రూ.3వేల కోట్లు పోతే రూ.22,106 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు. సంగం బ్యారేజీ గేట్లు, నెల్లూరు బ్యారేజీకి పేర్లు మార్చుకోవడం తప్పా జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు.

ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశావా? వంశధార నాగావళి అనునసంధానం పనులు టీడీపీ మొదలు పెడితే ఎందుకు పూర్తి చేయలేకపోయావు? పోలవరం ప్రాజెక్టును గోదావరి ముంచేశారు. 72 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి ఎందుకు పెండింగ్ పనులు పూర్తి చేయలేకపోయారు. పట్టిసీమ పంపులకు బూజు పట్టించారు. పురుషోత్తమపట్నం గాలికి వదిలేశారు. 2022-23లో భాగంగా పట్టిసీమ పంపులు ఆడించాల్సి వచ్చింది. 110 టీఎంసీలు వచ్చేవి. ఆ పంపులు పని చేస్తే చంద్రబాబుకు పేరొస్తుందని 50 టీఎంసీలు కూడా తీసుకోలేకపోయారు. మొత్తం 110 టీఎంసీలు తెప్పించి ఉంటే హంద్రీ నీవాలో కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అన్నింటికి నీరందేది. ఒక్క కొత్త కాలువైన జగన్ రెడ్డి తవ్వాడా?

ఒక ఇరిగేషన్ మంత్రి బుల్లెట్ దిగుద్ది అన్నారు ఇంత వరకు అంతు లేడు.మరో ఇరిగేషన్ మంత్రి సంబరాల రాంబాబు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే మా కేం తెలుసు దేవుడికి తెలుసు అని చెప్పి తప్పించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ లను తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఉన్నారా? ఇరిగేషన్, డ్యాంల గురించి మాట్లాడే అర్హత ఇరిగేషన్ మంత్రికి ఉందా? కడప జిల్లాలో అవినీతి, ఇసుక దోపిడీ వలనే అన్నమయ్య డ్యాం, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. చంద్రబాబు గండికోట బాధితులకు డబ్బులిచ్చి పెద్ద ఎత్తున 25 టీఎంసీలు నిలబెట్టారు. కాని జగన్ రెడ్డి కొత్త ఆయకట్టు ఒక్క ఎకరాకైనా నీరందిచారా?

రాయలసీమను రత్నాల సీమను చేసేందుకు చంద్రబాబు హంద్రీ నీవా పనులు పూర్తి చేస్తే నేనే చేశానని జగన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ పనులు గాలికి వదిలేశారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఏమయ్యాయి? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ. 12వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేశారు. 5 ఏళ్లు ఇరిగేషన్ శాఖలో పెట్టిన ఖర్చు ఎంతో లెక్కలు మా దగ్గర ఉన్నాయి. జగన్ రెడ్డికి దమ్ముంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలి.

హంద్రీ నీవా కాలువకు 45 టీఎంసీలు నీళ్లు నడిపించారు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరందించాం.

కుప్పం బ్రాంచ్ కెనాల్ లో రెండో లిఫ్ట్ నుంచి మూడో లిఫ్ట్ కు నీళ్లు ఇవ్వడానికి రూ.30 కోట్లు ఖర్చు పెట్టి డబ్బా కొట్టుకుంటావా? చిత్తూరు జిల్లాలో గణేష్ పురంలో పాలారు రిజర్వాయర్ వద్ద రూ.214 కోట్లతో మూడు రిజర్వాయర్లు కడతానని చెప్పి తప్పుడు జీవోలు ఇస్తున్నారు. ఎప్పుడైనా జగన్ రెడ్డి పక్క రాష్ట్రం సుప్రీంకోర్టులో వేసిన కేసును ఎప్పుడైనా పట్టించుకున్నావా? అటవీ శాఖ క్లియరెన్స్ లు ఏమైనా తెచ్చావా? రూ. 1.72 లక్షల పనులకు రాజశేఖర్ రెడ్డి చేసిన పనులకు దిక్కుందా? ఈ నెల 5వ తారీఖు తేవాల్సిన నీటిని 26వ తారీఖు తెస్తున్నారు. అదీ కూడా రైతుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు.

హంద్రీ నీవా కాలువల మీద టీడీపీ హయాంలో ఎప్పుడైనా కేసులు పెట్టామా? కర్నూలు రైతాంగానికి నీరందించాక తరువాత అనంతపురం జిల్లాకు నీరందించాం. చంద్రబాబు హయాంలో బ్రహ్మాంఢంగా నీరందించాం. కాని నేడు జగన్ రెడ్డి రైతుల మీద కేసులు పెట్టి, ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాయి. అవి కూడా 21 రోజులు ఆపసోపాలు పడి కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎండగట్టి నేడు కుప్పం ప్రజలకు నీరిచ్చారు. మీ మోసాలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. డ్రిప్ ఇరిగేషన్, ఇజ్రాయల్ టెక్నాలిజీ, బిందు సేద్యం వంటి వాటిని సమర్ధవంతంగా చంద్రబాబు అమలు చేశారు. గ్రీన్ హౌస్, పాలీ హౌసీ అంటే జగన్ రెడ్డికి తెలుసా?

పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లు గ్రానైట్ ను దోచుకున్నారు. పెద్దిరెడ్డి రూ.600 కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. ఒక్క కి.మీ. రోడ్డు వేయలేని జగన్ రెడ్డి కుప్పం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. పులివెందుల నుంచి పోటీ చేస్తానని చెప్పలేని నువ్వు కుప్పం గురించి మట్లాడటం హేయం. తెలుగుదేశం, జనసేన పార్టీలు, ప్రజలతో కలిసి వైసీపీని బంగాళఖాతం కలపడానికి సిద్ధంగా ఉన్నాయి. కుప్పం నీళ్లు రామకుప్పం మండలం దాటి ముందుకు వెళ్లలేదు.

వచ్చిన కొద్ది పాటి నీళ్లు భూమిలో ఇంకిపోయాయి. 2018లో చంద్రబాబు కుప్పం అభివృద్ధికి రూ.1400 కోట్లు విడుదల చేస్తే జగన్ రెడ్డి ఆ పనుల్నింటిని ఆపేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్ధులను అడిగితే తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేశారు? కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు.

డ్వాక్రా మహిళలకు రూ.23వేల కోట్లు చంద్రబాబు ఇస్తే నేడు జగన్ రెడ్డి డ్వాక్రా మహిలలను మోసం చేశారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నారా? ఏ పొలంలోకి వెళ్లిన రైతన్న ఆవేదన చెందుతున్నారు. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి ని కాపాడుతున్న నువ్వు హత్యా రాజకీయాలు గురించి మాట్లాడం సిగ్గుచేటు. కోర్టులు కొట్టేసిన కేసులు గురించి సీఎం హోదాలో మాట్లాడటం హేయం.

తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? జగన్ రెడ్డికి సీబీఐ, 2 ఈడీ కేసుల్లో కచ్చితంగా శిక్ష పడుతుంది. అంటే 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ అర్హత జగన్ రెడ్డి కోల్పోతాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే నాటికి జగన్ రెడ్డి వయస్సు 57 ఏళ్లు, ఈడీ కేసుల్లో 6 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే 67 ఏళ్ల దాకా ప్రజా జీవితంలో పోటీ అర్హత కోల్పోతావు. జగన్ రెడ్డి రాజకీయ చరిత్ర ఇంతటితో ముగిసిపోతుంది.

 

LEAVE A RESPONSE