Suryaa.co.in

Andhra Pradesh

పెన్షనర్లకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్

– రేపటి నుంచే పెంచిన పెన్షన్ల పంపిణీ..
(జజుల కృష్ణ)

న్యూ ఇయర్ వేళ ఏపీ సర్కార్.. రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు బంపర్ గిఫ్ట్ ఇవ్వనుంది. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ మొత్తం రూ. 2,750 ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వారోత్సవాలను నిర్వహించనుంది ప్రభుత్వం.

రెండు వారాల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం.. జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ మొత్తం రూ. 2,750 అందివ్వనున్నారు. అంటే ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 2,500 లకు అదనంగా 250 పెంచారు. నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ‘నవరత్నాలు’ హామీలో భాగంగా పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తోంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేస్తారు.

కాగా, ఇప్పుడున్న లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో దేశంలోనే అత్యధికంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. జనవరి 3వ తేదీన రాజమండ్రిలో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక పాత, కొత్త పెన్షన్ లబ్ధిదారులు కలుపుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికిపైగా పెన్షన్ అందనుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మంత్రులకు సీఎం జగన్ కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ఆర్ పెన్షన్ పెంపు, ఆసరా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాలని ఆదేశించారు. అలాగే అవినీతికి దూరంగా ఉండాలని, ప్రభుత్వం చేస్తున్న మంచిని బలంగా చెప్పుకోవాలని సూచించారు.

LEAVE A RESPONSE