– ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతిపై ఈ నిర్ణయం
– ఫేజ్ -1 లో విశాఖలో 46.23 కిమీ, విజయవాడలో 38 కిమీ మేర మెట్రో సివిల్ పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచాం
– విశాఖ మెట్రో టెండర్లకు అక్టోబర్ 10, విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ 14 వ తేదీ గడువు
అమరావతి: విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం కల్పించినట్టు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్పి రామకృష్ణా రెడ్డి తెలిపారు. అమరావతిలోని ఏపీ ఎంఆర్ సీఎల్ కార్యాలయం నుంచి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫేజ్ – 1లో విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర ఉన్న 40 శాతం సివిల్ పనులకు టెండర్లు పిలిచినట్లు రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే టెండర్ నోటిఫికేషన్ విడుదల తర్వాత జరిగిన ప్రీ బిడ్ మీటింగ్ కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థలు పలు వినతులు ఎండీ దృష్టికి తీసుకొచ్చారు.
టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం ఇవ్వాలని,పనులను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభజించి టెండర్లు పిలవాలని కోరారు…దీనిపై ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు..కాంట్రాక్ట్ సంస్థల వినతి మేరకు టెండర్లలో పాల్గొనేందుకు జేవీలకు అవకాశం కల్పిస్తున్నామని…అయితే గరిష్టంగా మూడు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ గా పాల్గొనే అవకాశం ఇస్తున్నామని తెలిపారు..దీనివల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే చాన్స్ ఉంటుందన్నారు.
మరోవైపు రెండు ప్రాజెక్ట్ లను రికార్డు టైంలో 2028 నాటికి పూర్తి చేయడంతో పాటు నిర్మాణ వ్యయం పెరిగిపోకూడదనే ఉద్దేశంతో పనులను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభజించడం లేదని అన్నారు..ఇతర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్ట్ ల అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని రామకృష్ణా రెడ్డి తెలిపారు. విశాఖపట్నం మెట్రో టెండర్లకు అక్టోబర్ 10వ తేదీని, విజయవాడ మెట్రో రైలు టెండర్లకు అక్టోబర్ 14 వ తేదీ గడువు విధించినట్టు ఏపీఎంఆర్సీఎల్ ఎండీ రామకృష్ణా రెడ్డి చెప్పారు.