(మార్తి సుబ్రహ్మణ్యం)
పాలు-నీళ్లను వేరు చేసినట్లు.. జర్నలిస్టులను వేరు చేయాలన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రవచనాలు చూడముచ్చటగా, వినసొంపుగానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం.. విభజిత రాష్ట్రం..అంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కూడా, ఈ లెక్క ఇలాంటి పిలుపునిచ్చిన పుణ్యాత్ములు ఇప్పటిదాకా పుట్టలేదు. ఇకపై పుట్టరేమో? ఫలితంగా పాత్రికేయలోకం పుణ్యం ఆయన పిలుపుతో పుచ్చిపోయింది.
మొన్నామధ్య ఒక వామపక్షభావజాల దినపత్రిక వార్షికోత్సవానికి హాజరయిన రేవంత్.. జర్నలిజం, దాని మంచి చెడులు.. నకిలీ జర్నలిస్టులు, యూట్యూబ్, డిజిటల్, మీడియా, సోషల్మీడియా పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న, చిన్నా చితకా జర్నలిజం-జర్నలిస్టుల హడావిడి గురించి చాలాసేపు వాపోయారు.
పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాని వాళ్లు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నందున.. వాళ్లు-మేం వేర్వేరని ప్రజలకు చాటాల్సిన మహత్తర బాధ్యత మీదేనని, జర్నలిస్టులకే బాధ్యత అప్పగించిన మహాజ్ఞాని రేవంత్. అంటే అలాంటి వారిని మీ చేత్తో మీరే శిరచ్ఛేదం చేయమన్నది రేవంతుల వారి హితబోధ అన్నమాట.
అసలు రేవ ంత్ తెలివి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సంగతి ఆయనతో కలసి చాలా ఏళ్లు ప్రయాణించిన వారికి, దగ్గర నుంచి పరిశీలించిన వారికీ బహు బాగా ఎరుక. సరే.. ఆయన తె లివితేల గురించి పక్కనపెట్టి.. మొన్నామధ్య జర్నలిస్టుల గురించి కందినాతి చెన్నారెడ్డి గారి ‘పల్లకి’లో పనిచేసిన ఒకప్పటి జర్నలిస్టు రేవంత్, జాతినుద్దేశించి ఏం ప్రసంగించారో ఓసారి చూద్దాం.
‘నేను పాత్రికేయ మిత్రులను కోరుతున్నా. జర్నలిజానికి నిర్వచనం ఇవ్వండి. మమ్మల్ని ప్రశ్నించేవారిని సెపరేట్ చేయండి. వాళ్లను మీ పక్కన కూర్చోనీయకండి. వాళ్లను నేరుగా కూర్చోబెట్టండి. మాట్లాడండి. వాళ్లు-మేం వేర్వేరన్న భావన ప్రజల్లో కలిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్మీడియా, డిటిజల్ మీడియా, ప్రింట్ మీడియా..ఎవడుపడితే వాడు.. వాడికి పెన్ను పేపరిస్తే అ ఆలు మొత్తం రాయలేడు.
బీసీడీలు కూడా మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్టు అంటున్నాడు. నేను సోషల్మీడియా జర్నలిస్టునంటాడు. వాడి పేరు పక్కనే జర్నలిస్టు అని పెట్టుకుంటాడు వేరే ఆయన. వాళ్ల తాత, ముత్తాతలంతా జర్నలిజంలోనే పుట్టి పెరిగినట్లు! పోనీ ఏదైనా జర్నలిజం స్కూల్లో చదివిండా? లేక ఓనమాలు మొత్తమొస్తాయా అనుకుంటే అదీ రాదు’’అని, రేవంత్ నేటి జర్నలిజంలో ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించారు.
నిజమే. రేవంత్ చెప్పిన ఈ కఠోర నిజాలు విని జర్నలిస్టులు ఉడుక్కోవలసిన పనిలేదు. ప్రధానంగా రేవంత్ వ్యాఖ్యలపై.. తమకు వ్యతిరేకంగా రాసే వారిని పది అడుగుల లోతు పాతరేస్తానన్న కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీకి అనుబంధ-మానసిక మద్దతుదారయిన కొన్ని జర్నలిస్టు సంఘాలు, యూట్యూబర్స్ గుండెలుబాదుకోవడం వింతల్లో వింత.
ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ నిజాలే కాబట్టి! అయితే దానికి కారణం ఎవరు? ప్రభుత్వమా? మీడియా యాజమాన్యాలా? జర్నలిస్టుల సంఘాలా? రాజకీయ పార్టీలా?.. దానికి పాత్రికేయ మార్గదర్శి రేవంత్రెడ్డే సమాధానం చెప్పాలి.
దారితప్పుతున్న జర్నలిజంపై రేవంత్ ఆవేదనలో అణువంత అబద్ధం లేదు.
రేవంత్ పుణ్యాన జర్నలిజం పోకడలు చర్చించుకునే మహద్భాగ్యం దక్కంది. అప్పట్లో ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, ఆ తర్వాత వార్త యజమానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటిచ్చింది. సరే.. ఈనాడు మొదటినుంచి కాంగ్రెస్ వ్యతిరే -టీడీపీ అనుకూల వైఖరి ప్రదర్శించినదే కాబట్టి అదంతా బహిరంగమే.
ఆంధ్రజ్యోతి తెలంగాణలో తొలుత కొద్దికాలం టీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ పల్లకీమోసిన సంగతి తెలిసిందే. అప్పటి సీఎం కేసీఆర్పై అక్షర సమరం చేసిన ఆంధ్ర జ్యోతి యజమానిని.. కేసీఆర్ చండీయాగానికి పిలవడంతో వారిద్దరి వైరానికి తెరపడింది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రజ్యోతి, ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
వైఎస్ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ కోసం సూర్య, సాక్షి పత్రికలను పుట్టించడంతో.. అప్పటివరకూ కాంగ్రెస్కు మీడియాలోటు భర్తీ అయింది. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆంధ్రజ్యోతి-ఈనాడుకు వ్యతిరేకంగా ‘ఆ రెండు పత్రికల’ని వ్యాఖ్యానించడం, వాటికి ప్రకటనలు నిలిపివేయడం, అవి కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకోవడం తెలిసిందే.
ఆ తర్వాత కేసీఆర్ నమస్తే తెలంగాణ-టీన్యూస్ ప్రారంభించడం, అప్పట్లో దానికి అదనంగా వెలుగు, వీ-6 చానెల్ ఉండటంతో టీఆర్ఎస్ మీడియా రంగంలో బాహుబలిగా మారింది. ఫలితంగా తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కథనాలు వండి వార్చే సంప్రదాయం మొదలయింది.
అంతకుముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యతిరే వైఖరి తీసుకున్న్పటికీ ఆ పత్రికలపై నిషేధం ఉండేది కాదు. ఆ మీడియా జర్నలిస్టులను ఆ పార్టీలు గౌరవించేవి. కానీ ఎప్పుడయితే కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీలు సాక్షి, నమస్తే తెలంగాణ మీడియాను పుట్టించాయో, అప్పటినుంచే బహిష్కరణల పర్వం ప్రారంభమయింది. ఈనాడు, జ్యోతిని తమ ప్రెస్మీట్లకు రానివ్వని పరిస్థితి. అటు టీడీపీ కూడా సాక్షి, నమస్తే తెలంగాణ, ఆ తర్వాత టీవీ9ని ప్రెస్మీట్లకు పిలవని పరిస్థితి.
ఒక దశలో పెద్ద చానెళ్లయిన ఎన్టివి, టీవీ 9, మరికొన్ని చిన్నా చితకా చానెళ్లు తెలంగాణలో పదేళ్లు టీఆర్ఎస్ అనుకూలంగా శంఖారావం పూయించారు. అటు ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టివి, 10 టీవీలతోపాటు చిన్నా చితకా చానెళ్లు, వైసీపీ అనుకూల-టీడీపీ వ్యతిరేక వైఖరి తీసుకున్న పరిస్థితి.
ఇక మిగిలిన మధ్య-చిన్న తరహా ప్రింట్మీడియా సంస్థలు కూడా, ప్రకటనల కోసం అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం అంగలార్చిన అనుభవం చూసిందే. వాటి సర్క్యులేషన్ వేలల్లోనే ఉంటుంది కాబట్టి, వాటి ప్రభావం అతి తక్కువే. ఎందుకంటే అవన్నీ జిల్లాలవారీగా ఫ్రాంచైజీలు అమ్ముకునేవి కాబట్టి, జనంలో వాటి ప్రభావం అత్యల్పం. ఫలితంగా మీడియా పార్టీల వారీగా నిట్టనిలువునా చీలిపోయిన వాస్తవ పరిస్థితి.
రేవంత్రె డ్డి పీసీసీ అధ్యక్షుడయిన తర్వాత ఆయన కూడా సొంత సోషల్మీడియా టీమ్ను ఏర్పాటుచేసుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్ సర్కారును, తన సోషల్మీడియా టీమ్ ద్వారా వీలైనంత భ్రష్టుపట్టించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. బిగ్టివి కూడా రేవంత్ ప్రాయోజిత చానెలేనన్నది బహిరంగ రహస్యం. వీ6-వెలుగు సంస్థల యజమాని కూడా, కాంగ్రెస్లో చేరటంతో తెలంగాణలో కాంగ్రెస్ గొంతు పెరిగింది.
ఇక మళ్లీ రేవంత్ ‘ఆవేదనాస్రవంతి’కి వెళితే.. డిజిటల్, మీడియా, సోషల్ మీడియా గురించి ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలే. ఒకప్పుడు ప్రెస్మీట్ పెడితే మహా అయితే, జర్నలిస్టులు పదిమందికి మించి ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గ స్ధాయి నేత ప్రెస్మీట్ పెడితే, హీనపక్షం 30 మంది వస్తున్న పరిస్థితి. వీరిలో 20 మంది యూట్యూబర్సే. అలాగని ఈ డిజిటల్, సోషల్మీడియాను మరీ తేలిగ్గా తీసుకునేందుకు లేదు.
సరే ఎలాగూ బ్లాక్మెయిలర్స్, పెయిడ్ ఆర్డికల్ బాపతు మీడియా ఉన్నందున వాటిని పక్కనపెడితే.. సుదీర్ఘకాలం జర్నలిస్టులుగా పనిచేసి, యాజమాన్య ధోర ణి నచ్చక యూట్యూబులు, వెబ్సైట్స్ నిర్వహిస్తున్న వారికి జనాదరణ బాగుంది. వారి స్వేచ్ఛకు పరిమితులు లేవు కాబట్టి, నిజాలను ధైర్యంగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలకు అసలు ప్రమాదం ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టుల నుంచే!
ఇది కూడా మీడియా పుణ్యమే. ఎందు ంటే ఇప్పుడున్న ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా, ఏదో ఒక సంస్ధకు మానసికంగా అనుబంధంగా ఉన్నవే. అధికారంలో ఉన్నవారి అక్రమాలు ఆ మీడియా, యాడ్స్ మొహమాటంతో బయటపెట్టవు. ఒకవేళ బయటపెట్టినా.. ఏ 20వ పేజీలో చివర న సింగిల్కాలమ్లో రాసి, తద్దినం పెడతాయి. అదే డిజిటల్, సోషల్మీడియా అయితే జరిగినదంతా పూసగుచ్చినట్లు జనం ముందుంచుతాయి. సోషల్ -డిజిటల్ మీడియాకు ఆదరణ పెరడానికి కారణం అదే.
ఈ సందర్భంగా రేవంత్ ఆవేదనను తే లిగ్గా కొట్టిపారేయలేం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్థానిక విలేకరుల్లో 90 శాతం మంది స్థానికంగా జరిగే బిల్డింగ్ నిర్మాణాలు, ఆ పరిథిలో జరిగే రియల్ ఎస్టేట్లపై ఆధారపడి బతికేవాళ్లేనన్నది.. ఎంత గింజుకున్నా, మనం మనుషులం అన్నంత నిజం. రాత్రివేళ ఇసుక లారీలు ఆపి, వాటి నుంచి వసూలు చేస్తుంటే అరెస్టయిన సందర్భాలు.. గ్రామాల్లో కాంట్రాక్టర్లను బెదిరించినందుకు చెట్టుకు కట్టి కొట్టిన సందర్భాలు కోకొల్లలు.
ఇక గత పదేళ్ల కాలంలో పొట్టపొడిస్తేక్షరం ముక్క కాదు కదా.. జర్నలిస్టు అని ఇంగ్లీషులో రాయడం కూడా రాని అజ్ఞానులతోపాటు.. రౌడీషీటర్లు, డ్రైవర్లు కూడా రేవంత్ చెప్పినట్లు.. జర్నలిస్టుల అవతారమెత్తుతుంటే, మరి వీరిని కూడా జర్నలిస్టులు అనాలా? ఇదో చర్చ.
ఇది నిజమే అయినప్పటికీ.. అసలు ఈ పరిస్థితికి కారకులెవరన్నది కూడా ‘పాత్రికేయోద్ధారకుడ’యిన రేవంత్ ఆలోచించాలి. కొన్నేళ్ల నుంచి రెండు తెలుగురాష్ట్రాల్లో, మీడియాకు సంబంధించిన అవలక్షం ఒకటి విజయవంతంగా కొనసాగుతోంది. పత్రిక సర్య్యులేషన్, ప్రజాదరణ, అర్హత ఎంపిక పరీక్షతో సంబంధం లేకుండా.. ప్రెస్ ఐడెంటెటీ-అక్రెడిటేషన్కార్డు కావాలంటే నియోజకవర్గానికి నెలకు ఎంత ఇస్తారు? కేలెండర్ యాడ్స్ ఎంత ఇస్తారు? పండగల యాడ్స్ ఎంత ఇస్తారు? అసలు ఐడి కార్డు కావాలంటే ఎంత చెల్లిస్తారు? జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కావాలంటే ముందు ఎన్ని లక్షలు కడతారు? ఒక జిల్లా ఫ్రాంచైజ్ కావాలంటే ఎంత ఇస్తారు? అ్రె డిటేషన్ కార్డుకు ఎంత ఇస్తారు వంటివే ప్రాతిపదికగా, జర్నలిస్టులను ఎంపిక చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి.
చివరకు రేవంత్ హాజరైన మీడియా సహా, వామపక్ష అనుబంధ పత్రికలు కూడా ఇదే దారిలో నడుస్తున్న వైచిత్రి. అసలు వామపక్ష పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ల జాబితాలో.. ఆయా పార్టీల అనుంబంధ సంఘ నేతల పేర్లూ దర్శనమిస్తున్న పరిస్థితి.ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సీఐటీయు, ఏఐటియుసి వంటి అనుబంధ సంస్థల ఫుల్ టైమర్లు జర్నలిస్టులు కాకపోయినా, వారికి ఆ కోటాలో అక్రెడిటేషన్ కార్టులు ఎలా ఇస్తున్నారు? ఎందుకిస్తున్నారన్నది ప్రశ్న.
లబ్ధప్రతిష్ఠులైన కొన్ని అగ్ర మీడియా సంస్థలను మినహాయించి, తెలుగునాట ఉన్న తెలుగు-ఇంగ్లీషు-ఉర్దు మీడియా సంస్థలన్నీ ఇలాంటి వ్యాపారం చేస్తున్నవే. పోనీ మీడియా సంస్థలను పెంచి పోషిస్తున్న, స్థానిక విలేకరులకు యాజమన్యాలేమైనా జీతాలు లేదా గౌరవ భృతి ఏమైనా ఇస్తున్నాయా అంటే అదీ లేదు. జర్నలిజం.. నైతిక విలువల గురించి వాంతులు-విరేచనాలు చేసుకునే చాలా మీడియా సంస్థలు, ఏళ్లు-నెలల తరబడి జీతాలు ఇచ్చే దిక్కులేని పరిస్థితి. పైగా యాడ్స్ వేసుకుని జీతాలు తీసుకోమనే దిక్కుమాలిన సంస్కృతి.
మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు-అక్రమాలపై ఇన్ని సుద్దులు, హితోక్తులు చెప్పే పాలకులు.. ఏనాడైనా జర్నలిస్టులకు సక్రమంగా జీతాలు ఎందుకివ్వడం లేదని యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం చేశారా? కార్మిక చట్టాలకు పదును పెట్టారా? జర్నలిస్టులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించిన మొనగాడు ఇప్పటివరకూ ఎవరైనా ఉన్నారా అంటే అదీ లేదు.
దానితో విసిగివేసారిన స్థానిక విలేకరులు.. తాము ఎవరికో సంపాదించి పెట్టే బదులు.. తామే యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని, బతికేద్దామన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆ జీవన పోరాటంలోనే వాళ్లు బ్లాక్మెయిలర్లుగా మారి, రేవంత్రెడ్డితో తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. మరి అలాంటప్పుడు వారిని కూడా జర్నలిస్టులంటారా?.. వారిని మీ నుంచి వేరు చేయమని చెప్పడం వల్ల ఉపయోగమేమిటన్నది ప్రశ్న.
పోనీ రేవంత్రెడ్డి సూచించిన ఆ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులేమైనా సుద్దపూసలా అంటే అదీ కాదు. అసలు ఇప్పుడు ఎవరికి వారే పెద్ద. ఒకరిని మరొకరు నియంత్రించే పరిస్ధితి లేదు. తమ సంఘాల ఉనికి కోసం, గ్రామీణ-పట్టణ విలేకరులకు జిల్లా-రాష్ట్ర పదవులివ్వడ ం- జిల్లా కలెక్టర్కు యూనియన్ల తరఫున అక్రెడిటేషన్లు సిఫార్సు చేయడం ప్రతిష్ఠగా మారింది.
నిజానికి గ్రామీణ విలేకరులకు లైన్ అకౌంట్లతోపాటు, డెస్కుల్లో పనిచేసే సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లకు సక్రమంగా నెలవారీ జీతాలు ఇప్పించే దమ్ములేని జర్నలిస్టు సంఘాల వల్ల.. ఒక జర్నలిస్టును ముందస్తు నోటీసు లేకుండా తొలగిస్తే అడ్డుకుని, మళ్లీ సదరు జర్నలిస్టును అదే సంస్థలో ఉద్యోగం ఇప్పించే దమ్ములేని జర్నలిస్టు సంఘాల వల్ల.. పాత్రికేయలోకానికి వచ్చే లాభమేమిటన్నదే ప్రశ్న.
అసలు జర్నలిస్టు యూనియన్ల సిఫార్సులు చె ల్లవని.. డబ్బులు చెల్లించి జిల్లాలు కొనుగోలు చేసే ఫ్రాంచైజర్లు కాకుండా, నేరుగా పత్రిక ఎడిటర్/యజమాని ఇచ్చే లేఖలనే ఆమోదిస్తామని ప్రభుత్వం నిర్మొహమాటంగా ఎందుకు ప్ర టించదు? ఆ పనిచేస్తే ఈ తడికరాయబారం చేసే ఫ్రాంచైజ్ జర్నలిస్టుల బెడద తప్పుతుంది కదా?
అసలు ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసమే ఈ పోటీ కాబట్టి.. అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా, అవి ఇచ్చేస్తే అసలు ఎదురుడబ్బులిచ్చే ఈ ‘కిరాయి జర్నలిజం’ లోకి గ్రామీణ-పట్టణ విలేకరులు ఎందుకు ప్రవేశిస్తారు?
రేపు ఏ దావూద్ ఇబ్రహీం లాంటివాడో వచ్చి.. ఫలానా కరీంనగర్ జిల్లా ఫ్రాంచైజర్ కావాలనో, ఏ అమలాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టరు కావాలో చెప్పి దాని ఖరీదు చెల్లిస్తే.. నిక్షేపంగా, నిస్సంకోచంగా వారికి జిల్లా స్టాఫ్ రిపోర్టర్/జిల్లా ఫ్రాంచైజర్ ఇస్తున్న యాజమాన్యాలపై కొరడా ఝళిపించే దమ్ము ఈ పాలకులకు ఉందా? బహుశా రేవంత్రెడ్డి.. ఇంకా తాను ‘పల్లకి’ పత్రికలో పనిచేసిన జమానాను, ఇప్పటి జమానాతో పోల్చుకుంటున్నారేమో?! జమానా బదల్ గయా!!
జర్నలిస్టులకు ఇన్ని హితోక్తులు.. వారి అర్హతలపై లెక్కలేనని ప్రశ్నలు వేసిన రేవంత్.. ఢిల్లీలో మీడియా వ్యవహారాలు అప్పగించిన ఓటుకు నోటు కేసు నింనదితుడయిన ఉదయ సింహ ఏ పత్రికలో పనిచేశారు? ఏ జర్నలిజం స్కూల్లో చదివారు? ఏ డెస్కులో పనిచేశారు? ప్రస్తుతం సీపీఆర్ఓగా నియమించిన డాక్టర్ మల్సూర్ ఏ జర్నలిజం స్కూల్లో చదివారు? ఏ పత్రికలో పనిచేశారు? ఎన్ని వ్యాసాలు రాశారు?..అసలు జర్నలిస్టులు కాని వారిద్దరికీ ఏ అర్హతతో, మీడియాకు సంబంధించిన పదవులిచ్చారో కూడా రేవంత్రెడ్డి సెలవిస్తే బాగుండేది. జర్నలిజం పోకడపై ఆయన ప్రవచనాలకు అర్ధం-పరమార్ధం దక్కేదన్నది పాత్రికేయలోకపు ఉవాచ.