Suryaa.co.in

Telangana

రాహుల్‌కు కృతజ్ఞత చెప్పండి చాలు!

– ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదు
– బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదు.
– వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం
– ఎస్సీ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మీ ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు.. మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి తెలియజేయాలి. రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదు. భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.

ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం.ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపాం. సుప్రీం కోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశాం.

సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదు. కానీ మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాం. న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం.. ఇప్పుడు సాధించుకున్నాం. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించాం.

ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీం గారిని నియమించాం. ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే… భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇదొక గొప్ప అవకాశం.. ఇది పది మందికి ఉపయోగపడేలా చూడాలి.

కుర్చీలో మీ వాడిగా నేనున్నా… మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

LEAVE A RESPONSE