Suryaa.co.in

Telangana

కర్నాటక రాజకీయాలు తెలంగాణలో చెల్లవు

-కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి షాడో మిత్రుడు
-కేసీఆర్ ప్రమేయంతోనే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కర్నాటక క్యాంపు రాజకీయాలు
-కేసీఆర్ కు పీఎఫ్ఐ పై నిషేధం ఎత్తివేస్తామని చెప్పే దమ్ముందా?
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని తన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు తగ్గలేదు.గత ఎన్నికల్లో మాదిరిగానే 36 శాతం ఓట్లు వచ్చాయి. సీట్లు మాత్రమే తగ్గాయి.అట్లాగే కాంగ్రెస్ కు గతంలో 38 శాతం ఓట్లు 80 సీట్లు వస్తే ఈసారి 43 శాతం ఓట్లతో 134 సీట్లు గెలుచుకుంది.

గతంలో 20 శాతం ఓట్లు తెచ్చుకున్న జేడీఎస్ ఈసారి 13 శాతానికే పరిమయ్యాయి. జేడీఎస్ కు చేజారిన ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడ్డాయి. మత రాజకీయాలు చేసిన పార్టీ కాంగ్రెస్సే. ఒక వర్గం ఓట్లన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ కే పడేలా చేశారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం స్వయంగా ఒక వర్గం ఓట్లు చీలితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసి.. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడేలా చేశారు.

ఎంఐఎం పార్టీతోపాటు నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన ఎన్డీపీఐ పార్టీ సైతం కాంగ్రెస్ గెలుపుకు క్రుషి చేశాయి.బీజేపీని బూచిగా చూపి ఓట్లు దండుకున్న పార్టీ కాంగ్రెస్సే. హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హేళన చేసే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు చేసింది.

కర్నాటక రాజకీయాలు తెలంగాణలో చెల్లవు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు.తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం తథ్యం.హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ఎంపీ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం. హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో గెలిచాం. జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచుకున్నాం.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసే పనిచేస్తాయి. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మనుషులు కలిసే ఉన్నారు.. కర్నాటకలో మనసులు కలిశాయి. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి షాడో మిత్రుడు…. తెలంగాణలో కలిసే పనిచేయబోతున్నారు.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలే ఈ విషయాన్ని చెప్పారు.

కేసీఆర్ ప్రమేయంతోనే కాంగ్రెస్ పార్టీ కర్నాటక క్యాంపు రాజకీయాలు హైదరాబాద్ లో నిర్వహించేందుకు యత్నించింది. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించడం ఖాయం. కుహానా లౌకిక వాద పార్టీలన్నీ ఏకమైనా తెలంగాణలో బీజేపీ గెలుపును అడ్డుకోలేరు.

దమ్ముంటే భజరంగ్ దళ్ ను నిషేధించమని చెప్పగలరా? పీఎఫ్ఐ పై నిషేధం ఎత్తివేస్తామని చెప్పే దమ్ముందా కేసీఆర్ కు? కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రం అప్పులపాలైంది. ఉద్యోగాలకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అభివ్రుద్ది సాధ్యమవుతుంది.

LEAVE A RESPONSE