Suryaa.co.in

Andhra Pradesh

చేయిచేయి కలుపుదాం…ప్రగతి సాధిద్దాం!

-ఆదర్శ మంగళగిరికి అందరూ కలసి రావాలి
-తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేష్ భేటీలు

మంగళగిరి: రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలసి రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి.

బుధవారం నాడు తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను యువనేత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వవార్డులో నివసిస్తున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్నివర్గాల సహకారం అవసరమని అన్నారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన ప్రముఖ బిసి నేత, శ్రీప్రతిభ స్కూలు అధినేత కాజ లక్ష్మీప్రసాద్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బిసిల పుట్టినిల్లు అయిన తెలుగుదేశం పార్టీ ద్వారా బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. జగన్ ప్రభుత్వ విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని తెలిపారు.

విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొల్లగొడుతూ పేదవిద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. మంగళగిరిని నెం.1గా మార్చే అభివృద్ధి ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, ఇందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. తర్వాత తాడేపల్లి 23వవార్డు మహానాడు కాలనీకి చెందిన బిసి ప్రముఖుడు డాక్టర్ బుడ్డా సోమేశ్వరరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు.

సోమేశ్వరరావు ఆర్ఎంపి డాక్టర్ గా గత 20ఏళ్లుగా ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యసేవలను విస్తరించేందుకు మీవంటి సహాయ,సహకారాలు అవసరమని తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలను ఏర్పాటుచేసి నియోజకవర్గవ్యాప్తంగా వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మంగళగిరి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయానికి మీవంతు సహాయ,సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE