తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
మంగళవారం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాధ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, బేవరేజెస్
కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, కార్పొరేటర్ విజయారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, హైద్రాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, నగర లైబ్రరీ ఛైర్మన్ ప్రసన్న, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపుతో 3 రోజులుగా ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెడింటి ఆడపడుచు వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు 11 లక్షల మండి వరకు లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని వివరించారు. గర్బిణి మహిళలను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు, ప్రసవం అనంతరం ఇంటికి క్షేమంగా చేర్చేందుకు అమ్మ వడి కార్యక్రమం క్రింద 300 వాహనాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన మహిళలకు కేసిఆర్ కిట్ క్రింద బిడ్డ, తల్లి కి అవసరమైన సామాగ్రి తో పాటు 13 వేల రూపాయల నగదును అందిస్తున్నట్లు తెలిపారు.
ఇవే కాకుండా మహిళలు, విద్యార్ధినుల భద్రత కోసం ప్రభుత్వం షీ టీం లను ఏర్పాటు చేసిందని చెప్పారు. విద్యా, ఉద్యోగం రాజకీయ తదితర రంగాలలో ప్రభుత్వం సమాన హక్కును కల్పిస్తుందని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 150 స్థానాలు ఉంటే 75 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. గతంలో ఎండాకాలం వస్తే నీళ్ల కోసం ధర్నాలు జరిగేవి.. మారుమూల ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారని, మహిళల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకొని మిషన్ భగీరధ క్రింద ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు అడగకుండానే జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
తెలంగాణ ఆడ బిడ్డల బతుకమ్మ పండుగ నేడు ప్రపంచ వ్యాప్తమైందని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం తెలంగాణ సంస్కృతిలోనే ఉంది అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ గా మహిళలకు అవకాశం కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ఏ పథకం అమలైన అది మహిళ పేరుతోనే ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన మగ పిల్లలకు రూ. 12 వేలు ఇస్తే.. ఆడపిల్లలకు రూ. 13 వేల రూపాయలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపుతో 3 రోజులుగా మహిళలను గొప్పగా గౌరవించే విధంగా పెద్ద ఎత్తున కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక లబ్ధి చేకూరిందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లోనూ మహిళలకు మళ్లీ పెద్దపీట వేశారని తెలిపారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం మనసుపెట్టి పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.మహిళలను గౌరవించిన ఏకైక ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, సామాజిక సేవా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలతో కలిసి మంత్రి భోజనం చేశారు.