Suryaa.co.in

Telangana

దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే మోడీ సర్కారు కుట్రలను అంగీకరించేది లేదు

– తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు హిట్లర్ ను మించిన నియంతృత్వ పోకడల వైపు వెళ్తోంది. దేశంపై ఉత్తరాది ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దేశంపై హిందీ భాషను రుద్దేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బిల్లులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.

వీటి పేర్లను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సక్ష్యగా పేర్కొంటూ కేంద్రం లోక్ సభలో బిల్లులు ప్రవేశపెట్టింది. ఇది ముమ్మాటికీ దేశం మీద, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాషను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నమే. ఇప్పుడు న్యాయశాఖలో మొదలై… మెల్లిగా ఒక్కో విభాగం పేర్లు హిందీలోకి మారుస్తూ.. ఆ తర్వాత అధికారిక కార్యకలాపాలన్నీ హిందీలోనే జరగాలంటూ ఉత్తర్వులిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇటీవలే ఢిల్లీలో జరిగిన అధికారభాష పార్లమెంటరీ కమిటీ 38వ సమావేశంలోనూ అమిత్ షా దీనికి మద్దతిచ్చేలా మాట్లాడారు. హిందీ భాషకు ఆమోదం తక్కువగా ఉన్నా అందరూ అంగీకరించాలని అమిత్ షా చెప్పారు. అన్నిరాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలతో పాటు హిందీని స్వాగతించాలంటూ ఆయన మాట్లాడారు. ఇది హిందీయేతర రాష్ట్రాలను లొంగదీసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించేది లేదు.

అందరికీ ఆమోదయోగ్యమైన, అందరు సులభంగా మాట్లాడగలిగిన, చదవగలిగిన, రాయగలిగిన భాషలో అధికారిక కార్యకలాపాలు ఉండాలని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం.. అవేవీ పట్టించుకోకుండా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై రుద్ది తమ ఆదిపత్యాన్ని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తూ.. రాష్ట్రాల అస్తిత్వాన్ని, స్థానిక భాషల గొప్పదనాన్ని అణచివేయాలనేది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కుట్రగా కనిపిస్తోంది. హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మరోసారి చవిచూడాల్సి వస్తుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE