– రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే మోదీ అడ్డుకున్నారు
– యూరియా కొరతకు కేంద్రానిదే బాధ్యత
– రాంచందర్రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు
– కాంగ్రెస్ను బద్నాం చేసేందుకే యూరియా సంక్షోభం
– తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని.. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు యూరియా సంక్షోభాన్ని సృష్టిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను వెంటనే విడుదల చేయాలని తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా సమస్యను కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు యూరియా కేటాయింపుల విషయంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై గత కొన్ని నెలలుగా కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
సమస్య తీవ్రతను వివరించేందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే, ప్రధానమంత్రి మోదీ అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి నిలిచిపోయిందని, తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యతగల పదవిలో ఉన్న రాంచందర్రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి మూర్ఖపు మాటల వల్ల బీజేపీ ఎప్పటికీ బలపడదు. చచ్చిన పార్టీకి ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు.