Suryaa.co.in

Telangana

చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే మోడీ తాపత్రయం

-భారత్ ను విశ్వ గురువుగా నిలిపిన వ్యక్తి మోడీ
-మన విద్యార్థుల కోసం రష్యా ఇబ్రహీం యుద్ధాన్ని ఆపిన ఘనత మోడీది
-తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో లిక్కర్ స్కాములో తాకట్టు పెట్టిన ఘనత కేసీఆర్ కుటుంబానిది
-భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గురువుగా నిలిపిన మహా వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప 

మోడీ 9 ఏళ్ల పాలన సందర్భంగా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన సంయుక్త మోర్చా సమేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగప్ప మోడీ చేసిన అభివృద్ధిని వివరించారు .ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం లో ఏర్పడటం పక్కా అని అన్నారు.

మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని సంగప్ప మండిపడ్డారు. ఫసల్ భీమా యోజన లాంటి పథకం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు.

ప్రధాని మోడీ కింది స్థాయి నుంచి రావడం వల్ల ఆయనకు పేద ప్రజల కష్టాలు తెలుసని, అందుకే వారి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టారని సంఘపు వివరించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల ఆరోగ్య భీమా పేదలు, మధ్యతరగతి వాళ్ళని కాపాడుతోందని ఆయన చెప్పారు. 80 కోట్ల మందికి మూడేళ్లుగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత బియ్యం ఇస్తున్నారని అన్నారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేసి భారత్ కరోనా నుంచి మోడీ కాపాడారని చెప్పారు. ప్రపంచంలోనే ఇది అత్యధిక డోసులని ఆయన పేర్కొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయ బడ్జెట్ను రూ.21,933 కోట్ల నుంచి రూ.1,25,036 కోట్లకు పెంచారని అని చెప్పారు.

రైతు ఆదాయం రెట్టింపు లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని, ప్రతి ఏటా మద్దతు ధరలు పెంచుతున్నారని ఆయన వివరించారు. ఎరువులపైనే ప్రతి ఎకరాకు రూ 24 వేల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, యూరియా, డిఎపి, NPK బస్తాలపై భారీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని గణాంకాలతో సహ సంగప్ప వివరించారు. కేసీఆర్ కేవలం రూ 10 వేల రైతుబంధు ఇచ్చి తానే గొప్ప అనుకుంటున్నాడని, మోడీ 24 వేల ఎరువుల సబ్సిడీ రూ 6 వేలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్న విషయాన్ని రైతులకు తెలుసని సంగప్ప వివరించారు. దేశంలో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే రెండున్నర కోట్ల PM అవాస్ యోజన ఇల్లు ఇచ్చారని అయన చెప్పారు.

తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి తాము అధికారంలోకి రాగానే ఇల్లు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ కుమార్ చెప్పిన విషయాన్ని సంగప్ప గుర్తు చేశారు. ప్రతి మహిళలకు గౌరవం కల్పించాలని దేశంలో 11.3 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారని గుర్తు చేశారు.

జాతీయ రహదారులు దేశ ఆర్థిక గమనాన్ని ఏ విధంగా మారుస్తున్నాయో సంగప్ప స్పష్టంగా వివరించారు. సంగారెడ్డి – నాందేడ్ NH 161 నిర్మాణంతో నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గం ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయో ఆయన వివరించారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగితే, నేడు 36 కిలోమీటర్ల మేర ప్రతిరోజు రహదారుల నిర్మాణం జరుగుతుందని అయన చెప్పారు. తెలంగాణలో గతంలో 2500 కి.మీ జాతీయ రహదారుల ఉంటే నేడు రూ.1.10 లక్ష కోట్లతో ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని ఆయన వివరించారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని సంగప్ప అన్నారు.

మోడీ ప్రధాని అయ్యాక భారత కీర్తిని ప్రపంచంలో గొప్పగా విస్తరించారని నేడు ఏ దేశం పోయిన భారత్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని సంగప్ప చెప్పారు. మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రధానులు మోడీ పాదాభి వందనం చేస్తుంటే ఆయనపై వారికి ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలని సంగప్ప అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లె పల్లెల్లో బెల్టుషాపులు పెట్టి గ్రామాలను యువకులను మత్తుకు బానిస చేస్తుందనీ సంగప్ప దుయ్యబట్టారు. బీజేపీ కర్యకర్తలు అందరూ గ్రామ గ్రామాన కేసీఆర్ చేస్తున్న అక్రమాలను జనంలో బట్ట బయలు చేయాలని పిలుపునిచ్చారు. 9ఏళ్ల మోడీ పాలనపై జనం లో మంచి స్పందన ఉందని, దీన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సంగప్ప బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సమావేశం లో బిజెపి సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్, జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ డా.రవి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు సుధీర్ కుమార్, రామచంద్రం రాజనర్సింహ, మల్లికార్జున్ పటేల్, అశోక్, సుధీర్ భండారు, జ్యోతి, అనిత పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE