Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లే వేస్ట్ అనుకుంటే… వారికింకా ట్రైనింగా?

ట్రైనింగ్ పేరిట ఇప్పటికే 270 కోట్ల రూపాయలు ఎత్తారు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులందరూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత మోగించాలి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

వాలంటీర్ వ్యవస్థనే వ్యర్ధం అనుకుంటే వారికి ట్రైనింగ్ పేరిట ఇన్వాయిస్ రైజ్ చేసి గత నాలుగేళ్లలో ఈ ప్రభుత్వ పెద్దలు 270 కోట్ల రూపాయలను ఎత్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు . వాలంటీర్ల శిక్షణ కోసం ప్రతి ఏటా 68 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ నాయకుడు ఒకరు రామ్ ఇన్ఫో కంపెనీని ఇన్ డైరెక్ట్ టేకోవర్ చేయగా, ఆ కంపెనీకి వాలంటీర్ల శిక్షణ బాధ్యతలను అప్పగించారు.

ఐదేళ్లలో వాలంటీర్ల శిక్షణ కోసం దాదాపు 300 కోట్ల రూపాయల పైగానే ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గత నాలుగేళ్లలో 270 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో భాగంగా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ నిచ్చినదానికే ఈ ప్రభుత్వం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేస్తే ఏమీ చేయని దానికి డబ్బులు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఎందుకు ఊరుకుంటామని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును ఇదే మాదిరిగా ఎంతో దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు . మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలి పెట్టమని హెచ్చరించారు.

ఈ రకంగా ఎన్నో అక్రమాలు అరాచకాలు చేస్తున్న ప్రజలు చూస్తూ కూర్చోవడం సమంజసం కాదు. సంయమనంతో వ్యవహరిస్తూ అన్నింటికీ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ సోషల్ మీడియా పేటిఎం టీంకు రివార్డులు ప్రకటించిందట. సోషల్ మీడియా వేదికగా ఒకసారి ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడితే ఐదు రూపాయలు, రెండవసారి కామెంట్ పెడితే పది రూపాయలు… రఘురామకృష్ణం రాజు, లోకేష్ వంటి వారిని దూషిస్తూ పోస్టులు పెడితే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు తెలిసింది.

సొమ్ములిస్తే పనిచేయడానికి ఎంతోమంది ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకునే ప్రజాస్వామ్య వాదులకు సొమ్ములు అవసరం లేదు. మన సొమ్ములను వైసీపీ నాయకులు కొట్టేసి మనకు పైసా, అర పైసా చొప్పున పంచుతున్నారు. కొంతమంది జర్నలిస్టులు కూడా ఎర్నలిస్టులుగా మారిపోయారు.. న్యాయవ్యవస్థ గురించి నేను ఎప్పుడూ తప్పుడుగా మాట్లాడింది లేదు. న్యాయ వ్యవస్థ అంటే నాకు అపారమైన గౌరవం. న్యాయ వ్యవస్థను గౌరవిస్తే, రఘురామకృష్ణం రాజు భయపడిపోయారని కొంతమంది పనికిమాలిన వారు తమ టీవీలలో వ్యాఖ్యానాలు చేయడం సిగ్గుచేటు.

అన్యాయంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వ్యవస్థలను నేను ప్రశ్నిస్తా… అంతేకానీ తింగరి, అసభ్యమైన ట్విట్లు చేసే అలవాటు నాకు లేదు. మహిళా లోకం ఉమ్మెత్తి పోసే ట్విట్లు చేయడం నా నైజం కాదని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు. గత ఎన్నికలకు ముందు దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమని ఆయనే ప్రజలను కోరారు. అప్పుడు చెప్పిన వారిలో మేము కూడా ఉన్నాము.

మళ్లీ ఆ పార్టీ తరపున పోటీ చేస్తే మమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు. మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క మద్యం షాపు కూడా తగ్గించకుండా అదే విధానాన్ని తిరిగి యధావిధిగా కొనసాగిస్తున్నారు. మద్యం ఆదాయాన్ని సాకుగా చూపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విపరీతమైన అప్పులు చేసింది. మరొక ఏడాది పాటు మద్యం దుకాణాలు నిర్వహించుకోవడానికి వీలుగా ప్రైవేట్ వ్యక్తులకు బాడుగ అగ్రిమెంట్ కూడా ఈ ప్రభుత్వం రాసిచ్చింది . మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి చేయకుండా మహిళల పీకను జగన్మోహన్ రెడ్డి పిసికి వేశారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది.. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దాదాపు రెండు లక్షలకు పైచిలుకమందికి నైపుణ్య శిక్షణను ఇవ్వగా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే శిక్షణను కొనసాగించారు. చంద్రబాబు నాయుడు కృషి వల్ల వచ్చిన అవార్డులను అందుకొని ఫోటోలను కూడా దిగారు. అయినా, ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదని, అందులో పరికరాలు కూడా లేవని పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇటువంటి అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేశారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం నాడు సాయంత్రం ఏడు గంటలకు ప్రతి ఒక్కరూ తమ కాంపౌండ్ లో నిలబడి ప్లేటుపై గరిటతో శబ్దం చేస్తూ నిరసన తెలియజేయాలన్నారు. ప్లేటు గరిట పట్టుకొని బయటకు వెళ్లడం ఇబ్బంది అవుతుంది కాబట్టి విజిల్ వేసి తమ నిరసనను తెలియజేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు కి మద్దతుగా ప్రజలు తెలియజేసే నిరసన ఏ ఊరి కోటలో ఉన్న ముఖ్యమంత్రికి వినపడాలన్నారు.

ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియని వ్యక్తులకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెబుదామని సూచించారు. ఐదు నిమిషాల పాటు నిరవధికంగా ప్రజలంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని, తాము నిరసన తెలియజేసిన విధానానికి సంబంధించిన వీడియోను తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకొని ప్రపంచానికి తెలియజేయాలన్నారు.

LEAVE A RESPONSE