Suryaa.co.in

Telangana

ఓబీసీల దీక్షకు ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు సంఘీభావం

ఢిల్లీ: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుండడం తీవ్ర విచారకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్రలు అన్నారు.చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్,రాష్ట్ర శాఖ అధ్యక్షులు పర్వతం సతీష్,ఓబీసీ స్టూడెంట్స్ జేఏసీ ఛైర్మన్ జక్కని సంజయ్ తదితరులు ఆమరణ దీక్ష చేపట్టారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఈనెల ఒకటవ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్రలు శుక్రవారం మధ్యాహ్నం సందర్శించి తమ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలినాళ్లలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి నివేదించడాన్ని గుర్తు చేశారు.

మహిళలతో పాటుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు.అయితే, దీనికి ముందు దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాల్సి ఉంటుందన్నారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80ఏండ్లు సమీపిస్తున్నా కూడా ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం శోచనీయమన్నారు.

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ సందర్భంలో ఖాళీగా ఉన్న ఆరింటిలో నాలుగు పదవులను బీసీలకే ఇవ్వాలని ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్రలు కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో 42%రిజర్వేషన్స్ అమలునకు కేంద్రంపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడితే తమ పార్టీ బీఆర్ఎస్ రాజ్యసభలో సంపూర్ణ మద్దతునిస్తుందని ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్రలు హామీనిచ్చారు.

ఈ దీక్షలో విప్లవ సామాజికవేత్త భండారి గంగాధర్, అంబేడ్కర్ అజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి, సామాజిక విప్లవనేత గడ్డం మోహన్ రెడ్డి,రజక రిజర్వేషన్స్ పోరాట సమితి అధ్యక్షుడు కాపర్తి కుమార్ గార్గే,బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ, ఓబీసీ ఆజాదీకి పలువురు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE