గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాగలక్ష్మి తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఒక మహిళ స్పందన కార్యక్రమంలో స్వయంగా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రాధాన్య అంశంగా మారిపోయాయని మండిపడ్డారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.