విద్యార్థుల ఆత్మహత్య కేంద్రాలుగా మారిన నారాయణ విద్యాసంస్థలను తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో విద్యానగర్ లోని ప్రభుత్వ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్యామ్ మాట్లాడుతూ రామంతపూర్ నారాయణ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తన టిసి అడిగితే ఫీజుల పేరుతో యాజమాన్యం మానసికంగా, ఆర్థికంగా వేధించడంతో ఆ ఫీజు చెల్లించలేని విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ వస్తే శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలను కృష్ణానది అవతలికి తన్ని తరపుతన్న కేసీఆర్, ఆ హామీని తుంగలో తొక్కి వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ విచ్చలవిడి అనుమతులిస్తున్నారని పేర్కొన్నారు. ఫీజుల పేరుతో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తుండడంతో ప్రతి సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు.
తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయాలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నేతలు గణేష్ సాయి వంశీ శ్రీధర్ మానస సాహితీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.