– బిజెపిలోని కొందరు “లీక్ వీరులు” వీక్ కాక తప్పదు
– కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందే
– అసెంబ్లీకి రావడం ఏదో గొప్ప విషయంలా చూపించడం సరికాదు
– బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు భేటీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నితిన్ నబిన్ సిన్హా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై విలువైన సూచనలు చేశారు. సమిష్టికృషితో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా.. ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ…. వచ్చే నెలలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన జరగనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేలా కొత్త కొత్త అంశాలను కావాలనే తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని అన్నారు. అసెంబ్లీకి రావడం ఏదో గొప్ప విషయంలా చూపించడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ సభకు రావడంపై గబ్బర్ సింగ్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లుగా హైప్ సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
బిజెపిలోని కొందరు “లీక్ వీరులు” వీక్ కాక తప్పదని, పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా SIR (Special Intensive Revision) ప్రక్రియ తెలంగాణలో కూడా అమలవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలకు సంబంధించిన అక్రమ ఓట్లు ఉన్నాయన్న విషయం వాస్తవమని పేర్కొన్నారు. అలాంటి దొంగ ఓట్లను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని, స్వచ్ఛమైన ఓటరు జాబితాల ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అన్నారు.