Suryaa.co.in

Andhra Pradesh

ఈ నెల 14 నుండి ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’

• రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాం
• ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం..
• ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశాం
• 2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం
• 30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం
• ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి.. మెరుగైన జీవనోపాధి కల్పన
• పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ
• ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణాలు.. సంక్రాంతికల్లా పూర్తి చేయడమే లక్ష్యం
– వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాలలో ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించటం, సుస్థిర ఆస్తుల ఏర్పాటు చేసి జీవనోపాధులు మెరుగు పరచటం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలన్నారు.

పని కోరిన 15 రోజులలో పని పొందే హక్కు, లేనట్లైతే నిరుద్యోగ భృతి, పని ప్రదేశం నివాసాసిని 5 కి.మీ.కంటే దూరం ఉంటే రోజూ కూలీకి అదనoగా 10% వేతనం, పని ప్రదేశాల్లో ప్రథమచికిత్స, త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతన రేటు రూ. 300 ఇవ్వడం, పని ప్రదేశంలో కూలి మరణించిన లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైన ఆ కుటుంబానికి రూ.50,000/- నష్ట పరిహారం వంటి హక్కులను వారికి అందించాలని సూచించారు.

13,326 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా గ్రామసభలు:
ఆగష్టు 23వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో మునుపెన్నడూ లేని విధంగా అందరి సహకారంతో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించాం. ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం.

ఈ కార్యక్రమం మీ అందరి సహకారoతో చేయగలిగాం. అందుకుగాను మీ అందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఉపాధి హామీ పథకంలో మే 20వ తేదీ నుండి పెండింగ్ ఉన్న కూలీల వేతనాలను రూ. 2081 కోట్లను చెల్లించాం. ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం కావలసిన 9 కోట్ల పనిదినాలకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నారు.

రూ. 4500 కోట్ల పనులకు గ్రామసభల ఆమోదం:
ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా రూ. 4500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నారు. ఈ 100 రోజుల్లో మీ అందరి సహకారంతో ఉపాధి హామీ కూలీలకు 466.13 లక్షల పనిదినాలను కల్పించడoతో పాటు, 1.07 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలని పూర్తి చేశాం. అలాగే 46,745 ఎకరాల రైతు భూముల్లో ఉద్యానవన పంటల మొక్కలు నాటిoచాం.

గ్రామ సభల తీర్మానాల ఆధారంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరుకు 26715 పనులకు 2239 కోట్ల రూపాయలకు జిల్లా కల్లెక్టర్లు పరిపాలన ఆమోదం ఇచ్చారు. మిగిలిన 474 కోట్ల రూపాయల పనులకు పరిపాలన ఆమోదం త్వరితగతిన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపడతాము.

గ్రామాల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచాలి
గ్రామాల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకుగాను మంజురైన పనులను పండుగ వాతావరణంలో భూమిపూజ చేయడానికి సంకల్పించాం. ఈనెల 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో “పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమంలో ఈ పనులకు పెద్దఎత్తున భూమిపూజ చేయాలి. శాసనసభ్యులకు ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలి. శంకుస్థాపన కోసం గ్రామ పంచాయితీలు, ఎమ్మెల్యేలవారీగా రోజువారీ రూట్ మ్యాప్‌లను సిద్ధం చేయాలి. గ్రామ సచివాలయ, ఉపాధి హామీ, లైన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.

కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యకలాపాలు
ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులపై అవగాహన కల్పించాలి. పని యొక్క ఉపయోగం, భవిష్యత్తులో వాటి నిర్వహణపై ప్రజల్లో అవగాహన, బాధ్యత పెంచాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఎలా విజయవంతంగా నిర్వహించామో, అలాగే ఈ “పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాలు” నిర్వహించడానికి కృషి చేద్దాం.

అలాగే ప్రతి గ్రామ పంచాయితీలో అందరికీ కనిపించేలా 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే “ సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు” ఏర్పాటు చేయాలి.

2024-25 ఏడాదిలో 25.50 కోట్ల పనిదినాలు
2024-25 ఆర్థిక సంవత్సరానికి 25.50 కోట్ల పనిదినాలు, అలాగే 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 17.95 కోట్ల పనిదినాలు కల్పించాం, 1.30 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాం. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 3,000 కి.మీ. సిమెంట్ రోడ్లు, 500 కి.మీ. బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో హార్టికల్చర్, 25,000 ఫార్మ్ పాoడ్లు, 22,525 గోకులాలు, 30,000 ఎకరాల్లో ట్రెంచులు అందుబాటులోకి తేవాలని సంకల్పించాం. ఇప్పటికే 200 కి.మీ. సిమెంట్ రోడ్లు, 50 కి.మీ. బీటీ రోడ్లు, 53,257 ఎకరాల్లో హార్టికల్చర్, 11,512 ఫార్మ్ పాoడ్లు, 1900 గోకులాలు, 20,145 ఎకరాలలో ట్రెంచులు పూర్తి చేయడమైంది. మిగిలినవాటిపై కల్లెక్టర్లు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించి సకాలంలో పూర్తిచేసేందుకు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.

ఫార్మ్ పాండ్లు, గోకులాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం
ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో పండ్ల తోటలు, ఫార్మ్ పాండ్లు, గోకులాలు వంటి ఆస్తుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేయాలి. అన్ని ప్రభుత్వ సoస్థల భవనాలలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలను నిర్మించాలి.

ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో భాగంగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, BT రోడ్లను సంక్రాంతి నాటికి పూర్తి చేసి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో మళ్లీ ఘనంగా పల్లె పండుగ నిర్వహించుకుందామని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనంతరం.. కలెక్టర్లతో మాట్లాడి జిల్లాల్లో పరిస్థితులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక, సిమెంట్ తదితర విషయాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు, డ్వామా పీడీలు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఉపాధి ఏపీవోలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE