సజ్జల చెప్పిన పాఠం అప్పగించడమే మంత్రుల పని

• ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి
• పవన్ కళ్యాణ్ గొప్ప సంకల్పానికి అడ్డుపడకండి
• వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
• కాకినాడలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఉద్బోధ

సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన పాఠాన్ని అప్పగించడానికే మీకు మంత్రి పదవులు ఇచ్చారని మాకు తెలుసు… మంత్రులంటే పాలన చేయాలి. ఇచ్చిన పాఠాల్ని అప్పచెప్పడం కాదు.. ప్రజలకు మంచి చేసే అంలోచనలు చేయాలి అది మంత్రులు తెలుసుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన సోమవారం కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖండించారు.

ఈ సందర్బంగా పంతం నానాజీ మాట్లాడుతూ “గతంలో పనిచేసిన మంత్రికి ప్రస్తుతం ఉన్న అంబటి రాంబాబుకి జలవనరుల శాఖ ఏం చేస్తుందో కూడా తెలియదు. ఆ శాఖ చేయాల్సిన బాధ్యతలు, పనులు ఏంటో కూడా అర్ధం కాదు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి అనే తీరున రైతులకు మేలు చేయాలని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆనందం పొందుతున్నారు. గత మంత్రివర్గంలో కూడా నలుగురు మంత్రులు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. అయితే వారిపై ప్రజావ్యతిరేకత వస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారిని పూర్తిగా పక్కన పెట్టారు. దీనిని ప్రస్తుత మంత్రులు గుర్తుంచుకుంటే మేలు. పవన్ కళ్యాణ్ ని తిడితే హీరోలు అవరు… ప్రజాజీవితంలో జీరోలు గా మిగిలిపోతారు.

• మీరు తల్లి కాంగ్రెస్ దత్త పుత్రులా?
పదేపదే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడిగా మీరు పిలుస్తున్నారు. ఇక మీదట మిమ్మల్ని కూడా మేము తల్లి కాంగ్రెస్ దత్తపుత్రుడిగా పిలుస్తాం. మీ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అటు ఢిల్లీలో తల్లి కాంగ్రెస్ తో, ఇటు మీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడు. అంటే మళ్ళీ మిమ్మల్ని తల్లి కాంగ్రెస్ గూటికి చేర్చాలి అని భావిస్తున్నాడు. అంటే మీరు తల్లి కాంగ్రెస్ దత్తపుత్రులే. ప్రజలకు మంచి జరిగే సమయంలో ఏదో ఒకటి చేసి దానిని చెడగొట్టాలని భావిస్తున్నారు. అందుకే మంత్రులంతా మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలకు తెరలేపారు. మంత్రులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఉన్నాయి. పోలవరం పూర్తి, సాగు నీటి కాలువల పూడికతీత, చివరి ఆయకట్టుకు నీటిని ఎలా విడుదల చేయాలి అనే ఎన్నో అంశాలు జలవనరుల శాఖ మంత్రికి ఉన్నాయి.
దాడిశెట్టి రాజా కూడా మంత్రి అయ్యాకా ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరి పక్షాన మొగ్గుతున్నారో తెలిసి కూడా పవన్ కల్యాణ్ గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి గురించి చూడండి. రోడ్లకు మరమ్మతులు కూడా లేవు. పనులు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంది.

అలాగే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని చూసి పరిశ్రమల అధినేతలు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతున్న తరుణంలో వాటిని ఎలా నిలువరించాలి… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగు పర్చాలి.. యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి అని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ఆలోచించాలి.
అలాగే దేవాదాయ శాఖ మంత్రి సైతం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో దాని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్న మంత్రులు అవన్నీ పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా వారు ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

• రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి భరించలేక ఏదో ఒక అంశాన్ని పైకి తీసుకురావడమే ఈ ప్రభుత్వానికి తెలిసిన విద్య. కష్టాల్లో ఉన్న కౌలు రైతుల కుటుంబాలను కనీసం పరామర్శించని కటిక హృదయం ఉన్న పాలకులు ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. దీనిని వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం పార్టీ గాని అడ్డుకోలేవు. ఇకమీదట మీరు జాగ్రత్తగా మాట్లాడితే మేం కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడతాం. సమస్యల మీద మాట్లాడితే దానికనుగుణంగా మీరు సమస్యలపై సమాధానాలు ఇవ్వండి. అలా కాకుండా ఇష్టానుసారం మాట్లాడితే మేము కూడా మా నియంత్రణను కోల్పోవల్సి వస్తుంద”ని అధికార పార్టీ నాయకులు, మంత్రులను హెచ్చరించారు.

Leave a Reply