Suryaa.co.in

Telangana

కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పోయింది

• ఇతర రాష్ట్రాల పర్యటన పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాలాడుతున్నడు
• ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ నాయకత్వంలో కుట్ర జరుగుతోంది
• ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా
• నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరిక

‘‘రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. ఆయన మాటలను, హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదు. ఇగ తన పనైపోయిందని భావించిన కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతూ అక్కడి ప్రజలకు ఆర్దిక సాయం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నరు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ ఓట్లను చీల్చడం ద్వారా లబ్ది పొందాలని కేసీఆర్ నాయకత్వంలో కొందరు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మరెన్ని కుట్రలు పన్నినా ఈసారి ప్రజలు మాత్రం బీజేపీకి అధికారం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారని, ఎన్నికలెప్పుడొచ్చినా రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పెద్ద కొర్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన దాదాపు 25 మంది నాయకులు ఈరోజు బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ సహా అబ్రహం, బాలప్ప, సంజు, ఆర్.శివ, నవీన్, లక్ష్మణ్, అంజనేయులు, అంజప్ప, నర్సింహులు, మక్తల్ వెంకటేశ్, బుగ్గప్ప సహా పలువురు నాయకులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…..మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలం పెద్దకొర్ల గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. ఎర్రజెండాతో కొట్లాడి ఆ గ్రామాన్ని మొత్తం కాషాయంగా మార్చిన నేతలందరికీ నా అభినందనలు.

భారతీయ జెండాను చూసి గర్వించే స్థాయిలో నరేంద్రమోదీ పాలన కొనసాగుతోంది. పాకిస్తాన్ సహా విదేశీయులు సైతం భారత పతకాం నీడలో రక్షణ పొందుతుండటం గర్వకారణం.దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం. ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం తథ్యం. అందుకోసం అలుపెరగని పోరాటాలు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది.

తెలంగాణలో వేలాది మంది రైతులు చనిపోతే కేసీఆర్ వారిలో ఒక్కరికి కూడా నయాపైసా పరిహారం ఇవ్వలేదు. మాటల గారడీ తప్ప చేసిందేమీ లేదు. అందుకే ప్రజలకు కేసీఆర్ పై నమ్మకం పోయింది. ఇగ ఇక్కడ తనపనైపోయిందని, ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిసి జార్ఘండ్ పోయి జవాన్ల కు సాయం పేరుతో మరో కొత్త డ్రామాలాడుతున్నారు.కొడుకును సీఎం చేయడానికి ప్రతిరోజూ కేసీఆర్ ఇంట్లో గొడవ జరుగుతోందట. టీవీలు పగిలిపోతున్నాయట. ఇంట్లో పోరు తట్టుకోలేక ప్రజలను దారి మళ్లించేందుకు పర్యటనల పేరుతో కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు.మరోవైపు బీజేపీ నేతలను బదనాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నరు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై హత్యకు కుట్ర ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేసేందుకు యత్నించి విఫలమయ్యారు.

రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విషయం కేసీఆర్ కు అర్ధమైంది. అందుకే ప్రభుత్వ వ్య వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఆయన నాయకత్వంలో కొందరు కుట్ర చేస్తున్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ జిమ్మిక్కులు ఇక పనిచేయవు.

రాష్ట్రంలోని యువత ఉద్యోగాలివ్వాలని ఏళ్ల తరబడి కోరుతుంటే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్న ఘనుడు కేసీఆర్. 317 జీవో పేరిట ఉద్యోగ, ఉపాధ్యాయులను రోడ్డుపాల్జేస్తి వారి ఉసురు కొట్టుకుంటున్న దుర్మార్గుడు.

నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతుల పక్షాన బీజేపీ పోరాటాలు చేస్తూనే ఉన్నాం.లాఠీఛార్జీలు తింటున్నం. నాతోసహా పార్టీ కార్యకర్తలు జైళ్లకు కూడా పోయినం.అయినా భయపడాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో ఉధ్రుత పోరాటాలు చేస్తాం. టీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తాం. కాషాయ జెండా రెపరెపలాడించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు.

అదే సమయంలో కేసీఆర్ మోసపూరిత విధానాలు, కుటుంబ-నియంత-అవినీతి పాలనను ప్రజల్లోకి వెళ్లి ఎండగడతాం. దీంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊరూవాడా తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలను కోరుతున్నా.

LEAVE A RESPONSE