Suryaa.co.in

Andhra Pradesh Telangana

స్వామివారికి నెయ్యి మేం ఇస్తాం

– ముందుకొచ్చిన విజయ డైరీ
– టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి విజయ డైరీ సిద్ధం
– అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్: తెలంగాణ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయ డైరీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావు కు శనివారం లేఖ ద్వారా ప్రభుత్వ ప్రతిపాదనను తెలియజేశారు.

దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో విజయ డైరీ సంస్థ ప్రసిద్ధి చెందినదని, వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను కలిగి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయ డైరీ ఉత్పత్తులలో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి, విజయ డైరీ సంస్థ సన్నద్దతను తెలియజేశారు. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు.

దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావు కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE