– 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025 ముగింపు వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో “7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” ముగింపు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. తెలంగాణ జైళ్ళు మరియు శిక్షణా సేవల విభాగం, కేంద్ర హోంశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్తంగా పోటీలను నిర్వహించింది. ఈ పోటీలలో 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 1222 మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొని క్రీడలు, సాంస్కృతిక, ప్రొఫెషనల్, ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో పాల్గొని అద్భుతమైన తమ ప్రతిభ కనబరిచారు.
తొలిసారిగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్ పో ప్రిజన్ ప్రొడక్ట్స్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 28 పతకాలు (21 స్వర్ణం) సాధించి సమగ్ర విజేతగా నిలవడం గర్వకారణం. తమిళనాడు 17 పతకాలు, మహారాష్ట్ర 16 పతకాలు సాధించాయి. మొత్తం 133 పతకాలను వివిధ విభాగాల్లో ప్రదానం చేశారు. హైదరాబాద్ లో నేషనల్ ప్రిజన్ అకాడమీ ఏర్పాటు, ఆధారిత ఆధునిక పర్యవేక్షణ, కొత్త డీ-అడిక్షన్ సెంటర్లు, వరంగల్ లో హై-సెక్యూరిటీ జైలు నిర్మాణం వంటి సంస్కరణలను త్వరలో అమలు చేయబోతున్నామని తెలంగాణ జైలు, శిక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు.
జైలు అంటే కేవలం నిర్బంధ స్థలం కాదని, చెదిరిన జీవితాలను పునర్నిర్మించడానికి అవకాశం ఇచ్చే ప్రదేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్లో అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్లశాఖ జాతీయ స్థాయిలో కీర్తి చాటిందన్నారు, జాతీయ స్థాయి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని సౌమ్యమిశ్రాను కేంద్రమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
‘జైలు వ్యవస్థ కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. సంస్కరణలు, పునరావాసానికి వేదికగా మారుతోంది’ అని అన్నారు. మహాత్మా గాంధీ కొన్ని సందర్భాల నుంచి ప్రేరణ పొంది.. “నేరస్తుడిని కాదు, నేరాన్ని ద్వేషించండి’ అని అన్నారని ఆయన గుర్తుచేశారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చి వారిని మళ్లీ సమాజంలోకి పంపడమే జైళ్లశాఖ అసలు విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. విశిష్ట అతిథి గా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నో అంశాల్లో సంస్కరణలతో ముందుకు వెళుతున్న తెలంగాణ జైళ్ల శాఖను దేశ వ్యాప్తంగా రోల్ మోడల్ గా తీసుకోవాలని అన్నారు.
జాతీయ స్థాయిలో డ్యూటీ మీట్ ను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ జైళ్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అదనపు డీజీపీ రవి జోసెఫ్ ఐపీఎస్, ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ ఐపీఎస్, తదితర అధికారులు పాల్గొన్నారు