Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన జగన్ రెడ్డికి ప్రివిలేజ్ నోటీసులివ్వాలి

ఏకపక్షంగా సభ నిర్వహణ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతృత్వానికి ప్రయత్నాలు దుర్మార్గం
– శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

చట్ట సభల ప్రతిష్టకు, గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని కాగ్ నివేదిక ద్వారా బట్టబయలైంది. అబద్దాలతో ప్రజల్ని మోసం చేసిన వీరికి ప్రివిలేజ్ నోటీసులు ఎందుకు ఇవ్వకూడదు.? ఎఫ్ ఆర్ బీఎం చట్టాలను ఉల్లంఘించి అప్పులు చేయడం, ఖర్చులు, వ్యయాలను చట్ట సభల్లో చూపించకుండా దాచిపెట్టడం, తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు తేవడం వంటి ఆర్ధిక అవకతవకలను కాగ్ తప్పుబట్టడం వాస్తవం కాదా? అనాలోచిత, అసంబద్ద నిర్ణయాలతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన మీడియాపై అసెంబ్లీ సాక్షిగా దుష్ప్రచారం చేసిన జగన్ రెడ్డి, మంత్రి బుగ్గన ఇప్పుడేం సమాధానం చెబుతారు?

ట్రెజరీ నియమావళీ పాటించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే రూ.26,839 కోట్లు చెల్లించారు. రూ.9,124 కోట్ల కు సంబంధించి ఆర్ధిక శాఖ వద్ద వివరణే లేదు. కనీసం జీవోలు కూడా విడుదల చేయకుండా రహస్యంగా రూ.8,891 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటి? ఖర్చుల నియంత్రణ, నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని కాగ్ చెప్పినా చీమ కుట్టునట్లు కూడా లేదు. ఆర్ధిక వ్యవహారాలు పర్యవేక్షించే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సైతం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఏ శక్తి పనిచేస్తుంది. ఇది ప్రభుత్వంలోని జవాబుదారితనంపై ప్రభావం చూపడమే కాక ప్రజాధనాన్ని వినియోగంపై విధానపరమైన నియంత్రణను బలహీనపరుస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాధనం అంటే లెక్కలేదు.

దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధించామని సిఎం చెప్పారు. గత ఐదేళ్ల కంటే 20-21 లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైందని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు రూ.35,541 కోట్లతో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది గత ఏడాదితో పోల్చితే 34.42 శాతం పెరిగింది. ద్రవ్యలోటు 39.01 శాతం నుంచి 59.53 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా, డిసెంబర్ 2020 లో ఎఫ్ ఆర్ బి ఎం చట్టం సవరించారు. ఆ చట్టం ద్వారా నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి లేదని చెప్పడం వైసీపీ ప్రభుత్వ బరితెగింపుకు నిదర్శనం. రూ.18,975 కోట్లు మూలధన వ్యయం చేశామని చెప్పి అందులో రూ. 6, 278 కోట్లు రెనెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారు. ప్రభుత్వ పద్దుల్లో బుణాలను దాచిపెట్టారు. చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ అవసరాలకే ఖర్చు చేశారు. ఆస్తుల కల్పనపై దృష్టిపెట్టలేదు. కేంద్ర నుంచి రూ.5,838 కోట్లు పాక్షిక గ్రాంట్లు, బ్యాక్ టు బ్యాక్ లోనుగా పొందినప్పటికీ మూలధన వ్యయం చేయలేని పరిస్తితిలో ప్రభుత్వం ఉంది.

సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డికి స్థానిక సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదు. పంచాయతీలకు సంబంధించిన 14 వ ఆర్దిక సంఘం నిధుల నుంచి రూ.854 కోట్లు విద్యుత్ ఛార్జీలు చెల్లించారు. పంచాయతీ సభ్యుల అనుమతి తీసుకోకుండా నేరుగా చెల్లించడం పంచాయతీ రాజ్ సంస్థల న్యాయమైన హక్కులను ఉల్లంఘించడమే. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గర్బిణులు ప్రధానమంత్రి మాతృవికాస యోజన కింద ఇచ్చే రూ.5 వేలు కూడా కోల్పోయారు. ఇదేనా మీరు సాధించిన అభివృధ్ది?

ఏకపక్షంగా సభ నిర్వహణ :
ప్రజా సమస్యలపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా 21 బిల్లులను ఆమోదించుకున్నారు. కీలక బిల్లులపై కూడా చర్చ జరపకుండా ఆమోదించుకుని చట్ట సభల ప్రాధాన్యతను తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయడం సభ్యుల హక్కులను హరించడమే. చట్ట సభల్లో గూండాయిజం, రౌడీయిజం చేయడం దుర్మార్గం.

ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులుండరు:
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సైతం ఉల్లంఘించి వై ఎస్ ఆర్ సీ సీ శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని కోరుకోవడం జగన్మోహన్ రెడ్డి ఫ్యూడల్ మనస్థత్వానికి నిదర్శనం. ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి రాజకీయాలు చేయాలనే మనస్థత్వాన్ని జగన్ రెడ్డి అలవర్చుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టిన తర్వాత మీడియా, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం. జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు జులై 8, 2022 నాటి ప్లీనరీలో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటించడం వాస్తవం కాదా?

LEAVE A RESPONSE