– నువ్వు చెప్పిన 66 శాతం ఫలితాలు నిజమైతే ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పెట్టించు
– ఢిల్లీలో విందులు , వినోదాలు సీఎం రమేష్ ఇంట్లో జరుగుతున్నాయి
– ఢిల్లీ తుగ్లక్ రోడ్ లో రేవంత్ రెడ్డి ఇల్లు రీమోడల్ చేయించిందే బీజేపీ ఎంపీ
– సీఎం రమేష్ కు కాంట్రాక్ట్ లు ఇస్తుందే రేవంత్ రెడ్డి
– రేవంత్ జూబ్లీహిల్స్ కిట్టీ పార్టీ ఆంటీ మాదిరి వ్యవహరిస్తున్నారు
– బిజెపితో చీకటి స్నేహం చేసేది రేవంత్ రెడ్డి.
– రేవంత్.. ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు
– నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా
– ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు
– కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం
– నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకనే.. 32జిల్లా పరిషత్, 136మున్సిపాలిటీలు గెలిచాం
– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్
హైదరాబాద్: తెలంగాణ భవన్లో శనివారం మీడియా ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన, రాజకీయ విలువలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ చర్చలో రాజకీయ ఫిరాయింపులు, బీసీ రిజర్వేషన్లు, కాంగ్రెస్-బీజేపీ అంతర్గత ఒప్పందాలు మరియు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం వంటి అంశాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సంస్కారవంతమైన రాజకీయం.. కుటుంబ సభ్యులను లాగడం సరికాదు
రాజకీయాల్లో సంస్కారం ముఖ్యం అని కేటీఆర్ స్పష్టం చేశారు. “రేవంత్ రెడ్డి ఇంట్లోని మహిళలు, పిల్లలు లేదా ఆయన మనమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను” అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పోరాటం కేవలం నేతల మధ్యే ఉండాలని, అస్సాం సీఎం రాహుల్ గాంధీ పుట్టుకను ప్రశ్నించినప్పుడు కూడా కేసీఆర్ గారు ఖండించారని, అది తమ సంస్కృతి అని గుర్తు చేశారు.
మొన్న మీడియా సమావేశంలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి మనవడితో ఫుట్బాల్ ఆడిన అంశంపై స్పందించాలని జర్నలిస్టులు కోరినప్పుడు.. రేవంత్ రెడ్డి మనవడి గురించి, కుటుంబ సభ్యుల గురించి తాను మాట్లాడే సంస్కారాన్ని మా పార్టీ అధినేత కేసీఆర్ నేర్పించారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం ఏనాడూ చేయలేదని కేటీఆర్ చెప్పారు. దీంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన మనవడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాలని ప్రార్థిస్తానని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల చావును కోరుకునేంత నీచమైన మనస్తత్వం తనది కాదన్న కేటీఆర్.. రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడినా తనకు సంబంధం లేదని, ఆయనతో ప్రజలు ‘ఫుట్బాల్’ ఆడుకోవడం ఖాయం అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బాగుండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, వారిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ కుటుంబ పద్ధతి కాదని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో పచ్చి మోసం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. అందుకే 23% ఉన్న రిజర్వేషన్లను పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికి తగ్గించిందని మండిపడ్డారు. పార్టీలపరంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రేవంత్ రెడ్డికి సంబంధమే లేదని, ఆయన సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలకు అధ్యక్షుడు కాదని కేటీఆర్ అన్నారు. అసలు బిసిలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బిసిలకు క్షమాపణ చెప్పాలి.
బీసీలకు సీట్లు ఇచ్చే అంశంలో కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తమ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 42 శాతానికి మించి, అన్ని సందర్భాల్లో బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన పార్టీ మాది అని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 జనరల్ సీట్లలో 6 సీట్లు (50%) బీసీలకు ఇస్తే, కాంగ్రెస్ ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము 34 సీట్లు బీసీలకు ఇస్తే, కాంగ్రెస్ కేవలం 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని లెక్కలు చెప్పారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి, బీసీ డిక్లరేషన్లోని అన్ని అంశాలపై రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారన్నారు. నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. దీంతోపాటు బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్లో పేర్కొన్నట్లు ముదిరాజ్లను బీసీ-డి లోకి చేరుస్తామని, 20 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ ఇస్తామని ఇచ్చిన ఒక్క మాటైనా రేవంత్ నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. విద్యా, ఉపాధి, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టంతో సంబంధం లేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తోనే ఇవ్వవచ్చని, కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని ధ్వజమెత్తారు. వైన్ షాపుల్లో గౌడ్లకు, మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
కాంగ్రెస్ – బీజేపీల మధ్య ‘చీకటి స్నేహం’
కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహప్రవేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారో బీజేపీ నాయకుడు రామచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్లో రేవంత్ రెడ్డి నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బీజేపీ ఎంపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ వంటి వారికి రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బీజేపీ ఆయనకు అండగా నిలుస్తోందని ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎంగా మారిందని, ఇక్కడ ‘ఆర్ఆర్ ట్యాక్స్’ నడుస్తోందని సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి అన్నా కూడా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ తమకు మొదటి నుంచి మిత్రుడని, ఆయనతో కలిస్తే బీజేపీ నేతలకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల తర్వాత కూడా కేసు నమోదు చేయని ఏకైక సందర్భం తెలంగాణ మంత్రి పొంగులేటి అంశంలోనే ఉన్నదని, ఈ అంశం మీద బీజేపీ నాయకులు మాట్లాడాలన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి వల్ల ఎవరికీ లాభం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా తేలేని కిషన్ రెడ్డితో మాకేం లాభం ఉంటుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై స్పందిస్తూ.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య అద్భుతమైన మైత్రి బంధం ఉన్నదని, అది రేవంత్ రెడ్డికి, బీజేపీ నేతలకు కూడా తెలుసు అన్నారు. అందుకే ప్రధానమంత్రి కూడా బీజేపీ నేతలకు తలంటి పోసినట్లు వార్తలు వచ్చాయన్న అంశాన్ని ప్రస్తావించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజీనామా సవాల్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎమ్మెల్యేలు మైకుల్లో బహిరంగంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని మేము బీఆర్ఎస్లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ” అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు స్పీకర్ ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, బయట మాత్రం రాహుల్ గాంధీ కండువా కప్పుకున్నామని చెబుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి గబ్బిలాల్లా తయారైందని, పదవుల కోసం ఇంత దిగజారడం దురదృష్టకరమని అన్నారు.
పాలనా వైఫల్యం – పారిశ్రామికాభివృద్ధికి విఘాతం
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, పారిశ్రామికవేత్తలు భయపడి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విరూపాక్ష ఫార్మా వంటి కంపెనీలు కర్నూలుకు వెళ్ళిపోవడమే దీనికి నిదర్శనమన్నారు. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డ్రామాలు ఆడుతున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసినా వీళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఫార్మాసిటీ రద్దు, ఫార్మా విలేజీల ఏర్పాటు అంటూ అడ్డమైన విధానాల వలనే ఈ పరిస్దితి వచ్చిందన్నారు.
ఉపాధి హామీ పథకం సవరణపై మండిపడిన కెటిఅర్
ఉపాధి హమీకి చేసిన సవరణల వలన గ్రామీణ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.ఈ అంశంపైన ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ పేర్ల మార్పు వల్ల దేశవ్యాప్తంగా అదనపు భారం పడుతుందని చెప్పాలి. తన సొంత ప్రభుత్వం ఇక్కడ అడ్డగోలుగా పథకాల పేర్లను, ప్రాంతాల పేర్లను మార్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అసలు పేర్ల మార్పు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందు దొబ్బే అన్నారు.
ఎందుకంటే రెండు పార్టీలు కూడా ప్రజల జీవితాలను మార్చే అంశం పైన దృష్టి పెట్టకుండా కేవలం పేర్ల మార్పుపై దృష్టి పెట్టారన్నారు. ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పిడిపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నదన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, పేర్ల మార్పిడి మాత్రమే కాకుండా తెలంగాణ తల్లిని కూడా మార్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చేస్తున్న విమర్శలపైన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసివేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. అసలు గాంధీ మహాత్ముని పేరును తీసివేయాలనే ఆలోచన బీజేపీకి ఎలా వచ్చిందన్నారు. బీజేపీ పేరు మార్పు మాత్రమే కాకుండా, ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా అనేక నిబంధనలు ఉంచిందని, ఈ అంశాన్ని తమ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్ దిశానిర్దేశం – పార్టీ భవిష్యత్తు కార్యాచరణ
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ‘హనీమూన్ పీరియడ్’ ముగిసిందని, ఇకపై కేసీఆర్ గారు నేరుగా ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ ప్రకటించారు. రేపు జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపైన రేపటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు.
మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్ అభివృద్ధి
గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని, గ్రేటర్ ను మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన అని కేటీఆర్ విమర్శించారు. చిన్న మున్సిపాలిటీలను పెద్ద మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లలో కలిపే అంశంపై స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదన్నారు. మరోవైపు వార్డుల విభజన కూడా అశాస్త్రీయంగా, అడ్డగోలుగా జరిగిందన్నారు. కేవలం ఒక గదిలో కూర్చుని విభజన చేసినట్లు కనిపిస్తోందని, ఎందుకంటే ఒక్కొక్క వార్డులో అత్యంత తక్కువ జనాభా ఉంటే, మరొక వార్డులో భారీగా ఓటర్లు ఉన్నారన్నారు.
రేవంత్ రెడ్డి హైదరాబాద్ జీహెచ్ఎంసీని విస్తరించి 300 వార్డులుగా చేసినప్పటికీ.. అసలు ఎన్ని కార్పొరేషన్లు చేస్తారు? ఈ మొత్తం పునర్వ్యవస్థీకరణ పైన ప్రభుత్వ ఆలోచన ఏంటి? అనే విషయాన్ని ప్రజలకు గానీ, పార్టీలకు గానీ, అసెంబ్లీలో గానీ ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలుగా చేస్తానని తన మిత్రులతో రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కేటీఆర్ ప్రస్తావించారు.
హైదరాబాద్ నగర విభజన అంశం ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వ అధికారుల కన్నా ముందే రేవంత్ రెడ్డి మిత్రులకు తెలుస్తోందన్నారు. స్వయంగా హైదరాబాద్ మేయర్కు కూడా ఈ అంశంపై సమాచారం లేదని మొన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే వార్డుల విభజన వంటి అంశాల్లో పార్టీ వైఖరిని బీఆర్ఎస్ నేతలు కౌన్సిల్లో స్పష్టంగా తెలియజేశారని కేటీఆర్ చెప్పారు. చిన్న మున్సిపాలిటీలను పెద్దవాటిలో కలిపితే అనేక సమస్యలు వస్తాయని తమ నాయకులు జీహెచ్ఎంసీ మీటింగ్లో ముందే హెచ్చరించారని తెలిపారు.
అనేక సంవత్సరాలు ఉద్యమం చేసి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రజల పోరాట స్ఫూర్తిని చూసిన తర్వాత.. కాంగ్రెస్, బీజేపీలు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేసే సాహసం చేయకపోవచ్చు అన్నారు. హైదరాబాద్ను రెండో రాజధాని చేస్తారనే ప్రయోగాలు కేంద్రం చేయకపోవచ్చని, ఇది ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రమని గుర్తు చేశారు.
చివరగా, 2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, రేవంత్ రెడ్డి పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సమయం కోసం వేచి చూస్తున్నారని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాహసించడం లేదని కేటీఆర్ అన్నారు. అందుకే వెంటనే పెట్టాలనుకున్న ఎన్నికలను సుదీర్ఘంగా వాయిదా వేసుకుంటున్నట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో తాము గెలుచుకున్న స్థానాల సంఖ్యను పెంచుకునేందుకు.. కాంగ్రెస్ రెబల్స్ ని, ఇండిపెండెంట్లను కూడా తమ అభ్యర్థులుగా చూపించుకుని జాబితా విడుదల చేశారని ఎద్దేవా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సాధించిన స్థానాలను తక్కువగా చూపించి సంతోషపడ్డారన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం బలంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని గుర్తించాలన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఊరూరా ప్రచారం చేసినా దక్కిన పంచాయతీల సంఖ్య చాలా తక్కువని.. అనేక మంది మంత్రుల సొంత నియోజకవర్గాల్లోని మేజర్ గ్రామ పంచాయతీలను తమ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారని తెలిపారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలపై రేవంత్ విమర్శలకు కౌంటర్
తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించానని, రేవంత్ రెడ్డి తన సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారని గుర్తు చేశారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతే పార్టీ ఓడిపోయిందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డును ఆయన ఎండగట్టారు.
తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలోని 90% మున్సిపాలిటీలను పార్టీ గెలుచుకుందని, జీహెచ్ఎంసీని రెండోసారి కైవసం చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ (ZP) స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరిందని, ఇవన్నీ తన పదవీ కాలంలోనే సాధించామని వివరించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా, మూడు చోట్ల డిపాజిట్లు కోల్పోయారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని కేటీఆర్ ఎత్తిచూపారు. ఇక ఓటముల విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఎన్ని చోట్ల విజయాలు సాధించారో రేవంత్ రెడ్డి చెబితే బాగుంటుందన్నారు. ముమ్మాటికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ‘ఐరన్ లెగ్’లు అన్నారు. తాను వ్యక్తిగతంగా ఇవి సాధించానని చెప్పుకోవడం లేదని, ఈ విజయాలన్నీ పార్టీ సమిష్టి కృషి వల్ల వచ్చినవేనని ఆయన స్పష్టం చేశారు.