అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్: బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా భట్టి బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనలేదు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది.
అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీతోనైనా, అటు కాంగ్రెస్ తో నైనా సమానమైన దూరంలో ఉంటది. రెండు పార్టీలతోనూ పోరాటం చేస్తది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతది.
ఇవాళ బీజేపీ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. కానీ, రేవంత్ రెడ్డి బీజేపీని పల్లెత్తు మాట అంటలేడు. బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు కూడా బడ్జెట్ చర్చలో కాంగ్రెస్ మీద మాట్లాడిన దానికంటే బీఆర్ఎస్ మీదనే ఎక్కువ మాట్లాడిండు. బీజేపీ – కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. సరే, ఎవరెన్ని బురద చల్లినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. బడ్జెట్ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నేను మాట్లాడినంత గట్టిగా మరెవరూ మాట్లాడలేదు.
నా ప్రసంగం – మహేశ్వర్ రెడ్డి ప్రసంగం చూశారు కదా. మేం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై బట్టలిప్పే ప్రయత్నం చేసినం. బీజేపీ మహేశ్వర్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసిండు. అయినా, ప్రజలందరికీ తెలుసు ఎవరేమిటో వారే చూస్తున్నారు.
సీతాఫల్ మండిలో పెండింగ్ లో ఉన్నటువంటి SDF నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిశాం. సీతాఫల్ మండిలో హై స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే చోటా ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ హయంలో 32 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ రాగానే నిధులు ఆగిపోయాయి. SDF నిధులు విడుదల చేయమని అడిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పద్మారావు గౌడ్ నన్ను తీసుకొని వెళ్లారు. ఈ విషయంపై వారికి రిప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది.