Suryaa.co.in

Telangana

చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి

– జవహర్ నగర్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రసంగించారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిండు అని విమర్శించారు. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం తరలించలేదన్నారు.

కేసీఆర్,మల్లారెడ్డి తొడుదొంగల్లా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు…కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారని విమర్శించారు. మేడ్చల్ కు ఐటీ కంపెనీలు తెస్తామన్న హామీని తుంగలో తొక్కారు అని ఆరోపించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ.2500 అందిస్తామన్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రూ.400గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12వేలు అందిస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.

మేడ్చల్ కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎందుకు రాలేదు

పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం మేడ్చల్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రసంగించారు. పేదోల బిడ్డలు చదువుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అందుకే డిగ్రీ కాలేజీ ఇవ్వలేదని మండిపడ్డారు. మంత్రిగా ఉన్నా మాల్లారెడ్డితో నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజకనం కలుగలేదన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందే తప్ప బీఆరెస్ చేసిందేం లేదని విమర్శించారు.

హైదరాబాద్ కు గోదావరి జలాలను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ పరిస్థితి ఏంటని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు అన్నారు.

ఈ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పివి అన్నారు. ఇవి దొరల తెలంగాణకు… ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడ్చల్ కు డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్ తెచ్చే బాధ్యత మాదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు

మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని బొడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13 వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా-యాదగిరి, 20 వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి రాఘవరావు, మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన PACS చైర్మన్ చల్లా లింగా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A RESPONSE