-ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల పంటకు 100రోజుల యాక్షన్ ప్లాన్
-బాధ్యతల స్వీకరణకు ముందునుంచే పని ప్రారంభించిన మిషన్ లోకేష్
అమరావతి: చేయాలనుకున్న పని పూర్తయ్యేవరకు పట్టువదలని విక్రమార్కుడిలా వెంటాడే తత్వాన్ని తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబునాయుడు నుంచి వారసత్వంగా పుణికిపుచ్చుకున్న యువనేత లోకేష్… రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఎన్నికల్లో అప్రతిహత విజయం తర్వాత కాస్తంత రిలాక్స్ అవుదామన్న ఆలోచించకుండా తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రప్రజల కోసం తొలిరోజు నుంచి పని మొదలు పెట్టారు.
ప్రజాదర్బార్ తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాల్లో పాలుపంచుకుంటూనే… హెచ్ఆర్ డి మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం అధికారులతో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఉపాధ్యాయ , విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అయి…వారి ఆశలు, ఆకాంక్షల మేరకు దీర్ఘకాలంగా విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలని సంకల్పించారు.
ఇందుకోసం వినూత్నమైన ఐడియాలజీతో ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడి విద్యనందించడం తప్ప పనికిమాలిన పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదన్నది ఆయన అంతరంగం.
పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది యువనేత లోకేష్ ప్రధాన లక్ష్యాలు.
వీటితోపాటు అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అయిదేళ్లపాటు నిద్రావస్థలో ఉన్న యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసి తనదైన ముద్ర వేసేందుకు మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు.
లోకేష్ పట్టుబట్టాడంటే ఉడుంపట్టే
ఎంత కష్టతరమైనా అనుకున్నది సాధించేవరకు వరకు నిద్రపోని మనస్థత్వం యువనేత నారా లోకేష్ సొంతం. ఈ అరుదైన లక్షణంతోనే కోట్లాదిమంది యువతలో ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 2017-19 నడుమ కేవలం రెండేళ్లు మాత్రమే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసినప్పటికీ… ఆయాశాఖల్లో గతంలో ఎవరూ సాధించనంత అభివృద్ధి చేశారు.
దేశంలో మరెక్కడా లేనివిధంగా రెండున్నరేళ్లలో 25వేల కి.మీ.ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సాధించారు.
గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది.
2018 సెప్టెంబర్ లో చైనాలోని టియాంజిన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి లోకేష్ ఆహ్వానం లభించింది. ఆ తర్వాత WEF నెట్వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ (NGFC)కి నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు యువనేత నారా లోకేష్.
నవీనమైన, వేగవంతమైన ఆలోచనలతో రెండేళ్లలోనే హెచ్ సిఎల్, కాడ్యుయెంట్, పై కేర్, జోహో, టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ వంటి ఎన్నో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి ఆ రంగాల్లో వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు.
తాజాగా రాష్ట్ర మానవవనరులు, ఐటి,ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారధ్యంలో ఆయారంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.