Suryaa.co.in

Telangana

కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రికి రూ.12 కోట్లు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

విలేఖరుల సమావేశంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడి
సికింద్రాబాద్ : సీతాఫల్మండి లోని కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి (అర్బన్ కమ్మునిటీ హెల్త్ సెంటర్ (UCHC) భవనాలు శిధిల స్థితికి చేరుకోవడంతో కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.11.60 కోట్ల మేరకు నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వ జీ వో విడుదలైందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడించారు.

సోమవారం సీతాఫల్మండి లోని తన క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. కుట్టి వెల్లోడి ఆసుపత్రిని పరిశీలించారు. నిత్యం కనీసం 10 డెలివరీ (ప్రసూతి )కేసులు, ఇతరత్రా సాధారణ రోగాలకు సంబంధించిన 200 మంది రోగులకు ఓ పీ వైద్య సేవలు, ఉచితంగా మందులను ఈ ఆసుపత్రిలో అందిస్తారు. సికింద్రాబాద్ పరిధిలో 8 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఈ ఆసుపత్రి పరిధిలో ఉన్నాయి.

సుమారుగా 900 గజాల స్థలంలో సీతాఫలమండి కుట్టి వెల్లోడి ఆసుపత్రి కొనసాగుతోంది. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా దీనిని తీర్చి దిద్దే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాము అందించిన ప్రతిపాదనల మేరకు ఈ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీ ఓ జారీ చేసిందని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా వివరించారు. తమ అభ్యర్ధనకు వెంటనే స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రివర్యులు హరీష్ రావుకి, అదే విధంగా సికింద్రాబాద్ అభివృద్దికి సంబంధించి తాను అందించే అన్ని ప్రదిపదనలకు ఆమోదాన్ని తెలుపుతూ నిధులను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.

ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను ప్రారంభించేందుకు వెంటనే ఏర్పాట్లు జరుపుతున్నామని, తాత్కాలికంగా ఆసుపత్రిని తరలించేందుకు సహకరించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్ టీ సీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ లను కోరారు.

కాగా సికింద్రాబాద్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న లాలాపేట స్విమ్మింగ్ పూల్, లాలాపేట మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, అడ్డగుట్ట మల్టీ పర్పస్ ఫున్క్టన్ హాల్ నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తనిఖీ చేశారు. లాలాపేట స్విమ్మింగ్ పూల్ కు రూ.ఆరు కోట్లు, ఫంక్షన్ హాల్ కు రూ.ఆరు కోట్లు, అడ్డగుట్ట ఫంక్షన్ హాల్ కు రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు అయన తెలిపారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో పాటు వైద్య శాఖ అధికారులు, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE