– ఏడాది కాలంలో 835 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ని ప్రజలకు ఇచ్చాం
– ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి
– జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా?
– ఆరోగ్య ఉత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి …
హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా దామోదర రాజనర్సింహ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. యేడాది లో వైద్య ఆరోగ్య శాఖ లో 14 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 7750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశాం.ఉద్యోగ,ఉపాధి కోసం తెలంగాణ ఉద్యమం లో యువత రోడ్లపైకి వచ్చి పోరాడారు.
గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా,పరీక్షలు పెట్టకుండా ప్రశ్నా పత్రాలను అమ్ముకుంది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తే తెలంగాణ యువత కు ఉద్యోగాలు వచ్చాయి. 75 యేళ్ల స్వాతంత్ర్య భారత దేశ చరిత్ర లో, ఏ రాష్ట్రం ఒకే యేడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశంలో తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది.
డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత కృత్రిమ ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి కి ఇది నిదర్శనం. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని కోర్టు లకు వెళ్లినా న్యాయస్థానాలు సమర్థించలేదు. పరీక్ష వాయిదా కోసం కొందరు కృత్రిమ ఉద్యమాలు చేశారు.
2011 తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు.13 యేళ్ల తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ..563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు కు ఇది గీటు రాయి.
మూడున్నర యేళ్ల సర్వీస్ ఉన్నప్పటికి బుర్రా వెంకటేశం ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా నియమించాం. గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్చింది. ఆర్ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ ఎమ్మార్వో లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించింది.
10 యేళ్ల పాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్లను నియమించలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. ఏడాది కాలంలో 835 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ని ప్రజలకు ఇచ్చాం. ఇదొక రికార్డు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు కోటి 15 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.
50 లక్షల కుటంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. మొదటి యేడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం.రుణ మాఫీ, రైతు భరోసా తో కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. గత పాలకులు వరి వేసుకుంటే ఉరేనని అన్నారు.
మా ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తోంది.తెలంగాణ రైతులు 63 లక్షల ఎకరాల్లో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల ను పండించారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది.
సంక్రాంతి పండుగ కు వచ్చే గంగిరెద్దుల్లా కొందరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 15 యేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి.
ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే. ప్రభుత్వం పైన జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి. 10 యేళ్ళ పాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టే ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వ యేడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలి.