Suryaa.co.in

Telangana

మీ పరిస్థితి చూస్తుంటే గుండె తరక్కుపోతోంది

• గుండెగాం ప్రజలు ఏం పాపం చేశారు?
• ఈ ఊరు మునిగిపోతున్నా ఎందుకు ఆదుకోవడం లేదు?
• రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే
• తెలంగాణను సర్వనాశనం చేస్తున్న కేసీఆర్
• ఇక్కడ సొమ్మును పంజాబ్ కు పంచిపెడుతూ… మీ బతుకులను గాలి కొదిలేస్తారా?
• వానొస్తే టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికి తీసుకొచ్చి కట్టేయండి
• గుండెగాం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాల్సిందే
• డబుల్ బెడ్రూం ఇండ్లు రడీకాకముందే కురుస్తున్నయ్
• కేసీఆర్ పాలనలో పిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నరు
• పుట్టబోయే బిడ్డపైనా 1.2 లక్షల అప్పు చేసిండు…
• కేసీఆర్ కు పేదలంటే మంట… కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటడు
• బీజేపీ అండగా ఉంటాం… కేసీఆర్ సంగతి చూస్తాం
• బీజేపీ అధికారంలోకి రాగానే గుండెగాంను అద్దంలా మెరిపిస్తాం
– రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘‘గుండెగాం ప్రజల బాధలు వింటే గుండె తరక్కుపోతోంది. వానొస్తే ఊరంతా మునిగిపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి లేదు. కమీషన్ల కోసం ప్రగతి భవన్, సచివాలయం కట్టుకుంటడు. కాళేశ్వరం కడతడు… కమీషన్లు రావని గుండెగాం ప్రజలను గాలికొదిలేసిండు. అయినా 250 కుటుంబాలను ఆదుకోలేనోడు… తెలంగాణను ఏం కాపాడతాడు?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ కు పేదలంటే అలుసని… కేసులు పెట్టి బెదిరిస్తూ వేధిస్తూనే ఉంటాడని అన్నారు. గుండెగాం ప్రజలు బాధపడొద్దని, బీజేపీ పూర్తి అండగా ఉంటూ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే గుండెగాం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు.

గుండెగాం గ్రామస్తులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి, సీనియర్ నేతలు రామారావుపటేల్, మోహన్ రావు పటేల్ , రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు హాజరయ్యారు. అంతకుముందు గుండెగాం గ్రామస్తులు బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ ఊరిలోకి స్వాగతం పలికారు. అడుగడుగునా బండి సంజయ్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం రచ్చబండలో గ్రామస్తులతో ముచ్చటిస్తూ వారి బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా తమ బాధను బండి సంజయ్ తో పంచుకున్నారు.

‘‘వర్షం వస్తే మా పరిస్థితిని మాటల్లో కూడా చెప్పలేం. గత ఏడేళ్లుగా పునరావాసం కోసం తిప్పలు పడుతున్నాం. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే మమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. ప్రశ్నిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. గుండెగాం గ్రామం తెలంగాణలో లేదా? ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. వర్షాకాలంలో మమ్మల్ని చూడడానికి కూడా ఎవరూ రారు. నన్ను రెండుసార్లు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేవలం మమ్మల్ని ఆదుకున్నది, మమ్మల్ని చూస్తున్నది బిజెపినే. ఆర్టికల్ 19 రాసింది మా పేదల కోసమే కాదా? బండి సంజయ్ వస్తున్నాడు అంటే… టిఆర్ఎస్ నేతలు వనికి, రెండుసార్లు సర్వే చేశారు’’అంటూ గుండాగాం బాధితులు వాపోయారు. ‘‘10 ఏళ్లుగా మా బాధలు వర్ణనాతీతం. వర్షం వస్తే… మా పరిస్థితి అగమ్యగోచరమే – బండి సంజయ్ తో ఓ భూ నిర్వాసితురాలు. మాకు కొద్దో గొప్పో సాయం చేసింది రమాదేవి నే.అనంతరం గుండెగాం గ్రామస్తులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు… ముఖ్యాంశాలు…

కాలాలకు అతీతంగా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా. పేదోళ్ళ కష్ట,సుఖాలను తెలుసుకోమని మోదీ ఆదేశిస్తేనే… పాదయాత్ర చేస్తున్నా. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలి. పేదోళ్ల రాజ్యం వస్తేనే… మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. వర్షం వస్తే ఈ గుండెగాం గ్రామం మునిగిపోతుందని ఇక్కడి తమ్ముళ్లు నిన్న నాకు చెప్పినారు. మీ ఊరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటానని నిన్న చెప్పిన. అందుకే ఇప్పుడు మీ ఊరికి వచ్చాను. వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కేసీఆర్ వి కానీ, టిఆర్ఎస్ నాయకుల జాగాలు గాని ఉంటే… అవి మునిగితేనే… పరిహారం, పునరావాసం కల్పిస్తారు. చింతమడకలో ఎలా ఇచ్చారో మనం చూశాం. ఇక్కడ రైతులను ఆదుకోని పోటుగాడు… పంజాబ్ కి వెళ్లి, రైతులకు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. ఇక్కడ ఉన్న రైతులను మాత్రం ఆదుకోడు.

ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంత నాణ్యతా లోపంతో నిర్మించారో చూశాం. ముట్టుకుంటే పడిపోయే పరిస్థితి ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, ఇండ్లు కట్టిమ్మని మీరు అడుగుతున్నారు… మీ తరుపున ప్రభుత్వం పై పోరాటం చేస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా. రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో గుండెగాం గ్రామ మునిగిపోతుందని కనీసం సోయలేని ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడ 250 కుటుంబాలనే కాపాడలేనోడు… తెలంగాణని ఏం కాపాడుతాడు?. ప్రభుత్వం చెప్పే జీవోలన్నీ ఉత్తమాటలే. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు. కేసీఆర్ పాలనలో పిల్లల్ని కనాలంటే కూడా జనం భయపడుతున్నరు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా లక్ష 20 వేల రూపాయల అప్పు పెట్టిండు. కేసీఆర్, కెసిఆర్ కొడుకు, కూతురు, అల్లుడు వేల కోట్లు సంపాదించారు.

పేదోళ్ల జాగాలలోనే పోలీస్ స్టేషన్ లు, ఫైర్ స్టేషన్ లను కడతారు. కమీషన్ల కోసం గద్దల్లా వాలిపోతారు. గుండెగాం ప్రజల సమస్య పరిష్కారం కోసం ఉధృత పోరాటం చేస్తాం. కేసీఆర్ గుండెగాం గ్రామానికి రావాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ ఈ గ్రామానికి రాకపోతే… మనమే కేసీఆర్ దగ్గరికి వెళ్లి, కేసీఆర్ సంగతి ఏందో చూద్దాం. ఉచిత బియ్యం, వ్యాక్సిన్ ఇస్తున్నది మోదీనే. మోడీ ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా కట్టించడం లేదు.

ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను కూడా కేసీఆర్ దారిమల్లిస్తున్నాడు. దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెడుతున్నాడు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. వచ్చేది బిజెపి ప్రభుత్వమే. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మాకు జైళ్లు, పోలీసుల దెబ్బలు కొత్తేమి కాదు. ఏక్ నిరంజన్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఎంతసేపు ఎవరిని ఎలా ముంచాలో చూస్తాడు కేసీఆర్. 8 సంవత్సరాలుగా మీ బాధలను వినని ఈ ప్రభుత్వం, ఇక్కడి మంత్రి, ఎమ్మెల్యే అవసరమా? గుండెగాం ప్రజలను ఆదుకుంటావా… ఆదుకోవా కేసీఆర్? గుండెగాం ప్రజలకు బిజెపి నాయకులు, బిజెపి అండగా ఉంటుంది. ఇంకో 6 నెలల తరువాత వచ్చేది బీజేపీనే. మా పార్టీ అధికారంలోకి రాంగనే గుండెగాంను అద్దంలా మెరిపిస్తాం. అన్ని విధాలా ఆదుకుని అభివ్రుద్ధి చేస్తాం.

LEAVE A RESPONSE