– పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ఏమైంది?
– కాసుల కక్కుర్తితోనే గోడ కూలింది
– వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్
హైదరాబాద్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన లో పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ఏమైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు.
సింహాచలం గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయారని, 20 రోజుల కింద కట్టిన గోడ ఎలా కూలిపోయిందని ప్రశ్నించారు. కూటమి నేతల కాసుల కక్కుర్తితోనే గోడ కూలిందని ఆరోపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జగన్పై సీఎం చంద్రబాబు అబద్దపు ప్రచారం చేసినప్పటి నుంచి, స్వామివారు కన్నెర్ర చేసినట్టు ఉందని ఆ తర్వాతనే వరుస ఘటనలు భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం, 40 మంది వరకు గాయపడడం, తిరుమల కొండపై మందు, ఎగ్ బిర్యానీలు దొరకడం, టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతిచెందడం, శ్రీకుడుమంలో తాబేళ్లు మృత్యువాత పడడం వాటిని ఈఓ కార్యాలయం వెనుక కాల్చివేయడం ఇలా వరుస ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.