– చర్చకు మేం సిద్ధం
– మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి
– ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు
– ఇది ఏ చట్టంలో ఉంది?
– ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు
– ప్రచారం చేయాల్సింది మీరే
– మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు
– శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? పదేళ్లు దోచుకున్న నీకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కెసిఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు.
12 వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం.
ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. మొన్న ఒకాయన వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్ ను విమర్శించిండు.
వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి, ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు.
ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు. ఇది ఏ చట్టంలో ఉంది? ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?
సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇవేవీ మీకు కనిపించడంలేదా?
మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజలు విజ్ఞులు. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి.
కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలి. పేదలకు పంచాలి అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని. ప్రచారం చేయాల్సింది మీరే. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు.