-గూడ్స్ రైల్వే సర్వీసుల ద్వారా ఎఫ్ సి ఐ గోదాంలకు బియ్యాన్ని పంపిణీకి చర్యలు చేపట్టాలి
– గజ్వేల్ , మెదక్ ప్రాంతాలకు గూడ్స్ ద్వారా ఎరువుల పంపిణీ ని వెంటనే చేపట్టాలి..
– కొత్త రైల్వే లైన్లతో ఎఫ్సీఐ గోదాముల అనుసంధానంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు ఈ రోజు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని జీఏడీఏ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి మెదక్ కలెక్టర్, సిద్దిపేట అదనపు కలెక్టర్, ఎఫ్సీఐ జనరల్ మేనేజర్, మార్కెటింగ్ డైరెక్టర్, డివిజల్ రైల్వే మేనేజర్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గజ్వేల్లోని గోదాములను కొత్త రైల్వే లైన్లతో అనుసంధానించేందుకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోరారు. ధాన్యాన్ని, ఎరువులను ఈ లైన్ల ద్వారా రవాణా చేస్తే స్థానిక రైతులకు, పౌర సరఫరాల వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సనత్ నగర్, చెర్లోపల్లి నుంచి కాకుండా ఈ కొత్త లైన్ల ద్వారా ధాన్యం, ఎరువుల రవాణాను చేపట్టాలని సూచించారు. తద్వారా కాలయాపన, వ్యయం విపరీతంగా తగ్గుతాయని పేర్కొన్నారు.
మంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. గూడ్సు రైల్వే సర్వీసుల ద్వారా గజ్వేల్, మెదక్కు ఎరువులను రవాణా చేయాలని మార్క్ఫెడ్ అధికారులు ఈ సమావేశంలో నిర్ణయించారు.