Suryaa.co.in

Telangana

నాలుగువారాల్లో చర్యలు తీసుకోండి

– లేకపోతే మేమే సుమోటోగా విచారణ చేస్తాం
– పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్
– తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది . సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌ తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు.

కాగా టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, గద్వాల్ ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యేపోచారం శ్రీనివాస్ రెడ్డి , భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE