– ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, విశాఖలోనే పరిపాలన రాజధాని వుంటుందని, ఎవరు ఆపినా ఆగదని ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ఆరాధ్య దైవాలైన పోలమాంబ, కొత్తమాంబ ఆలయాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు దేవాలయాల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రీటైనింగ్ వాల్ పూర్తయిన తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుందని తెలిపారు.
తమిళనాడు శిల్పుల చేత ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
అనంతరం రాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివద్ధి చెందే ఏ కార్యక్రమాన్నైనా వైసిపి సమర్ధిస్తుందని తెలిపారు.
కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదని అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని విశాఖ రాకుండా అడ్డుకోలేరన్నారు.