– కాంగ్రెస్ శశిథరూర్ షాక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ‘అనర్హత’ బిల్లుల విషయంలో సీనియర్ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశిథరూర్ పార్టీ వైఖరికి భిన్నంగా స్పందించారు. ఈ బిల్లులపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుండగా, శశి థరూర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు.
30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతారు? ఇది చాలా సాధారణమైన విషయం. ఇందులో నాకు పెద్దగా తప్పేమీ కనిపించడం లేదు అని శశి వ్యాఖ్యానించారు. ఎవరైనా తప్పు చేస్తే మంత్రి పదవిలో ఉండకూడదన్నది చాలా తార్కికమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, తాను ఇంకా బిల్లును పూర్తిగా చదవలేదని, తన ఈ అభిప్రాయమే చివరిది కాదని స్పష్టం చేశారు.
ఈ బిల్లుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు, దానిపై లోతైన చర్చ జరిపేందుకు దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆయన సూచించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తామని అధికార వర్గాలు వెల్లడించడంపై కూడా శశిథరూర్ స్పందించారు. ఇది ఎంతో మంచి విషయమని ఆయన అన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే వారి పదవిని రద్దు చేసే నిబంధన ఈ బిల్లుల సారాంశం.