– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ఈసీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమాధానాల కన్నా అనేక ప్రశ్నలను లేవనెత్తింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియకు కీలకమైన భారత ఎన్నికల సంఘం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావుసంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- SIR) అవసరంతో పాటు ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్ అన్నారు. నేడు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన పత్రిక సమావేశంపై కేటీఆర్ స్పందించారు.
“ఎన్నికల సంఘం ఈ రోజు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే, సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇచ్చిన వివరణలో, సమస్యల పరిష్కారాల కన్నా సాకులుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి” అని కేటీఆర్ విమర్శించారు.
ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన ఎన్నికల సంఘం, అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక అనుబంధ విభాగంలా పనిచేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో లోపాలను ఈసీఐ అంగీకరించినప్పుడు, తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో, కేవలం ఓటర్ల జాబితాను సవరించడం కాకుండా, ఈసీఐ నియామక ప్రక్రియనే సమూలంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అన్నారు. మన దేశాన్ని ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశంగా పిలుచుకోవాలంటే, ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈసీఐ స్వయం ప్రతిపత్తిపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, కేటీఆర్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.