Suryaa.co.in

Andhra Pradesh

ఇచ్చేది గోరంత, కొట్టేసేది కొండంత

– మేదరమెట్లలోనూ జగన్ అబద్దాల విషపు జల్లు
– సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు కుంభకోణం
– రాజమహేంద్రవరం సిటీ టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం : మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. మాట తప్పి మడమతిప్పాడని, ఓటు అడిగే హక్కు కోల్పోయాడని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశాడని, నాసిరకం మద్యం వల్ల కిడ్నీ, లివర్ చెడిపోయి 30,000 మంది ప్రాణాలు పోయి, వారి భార్యల మాంగల్యాలు మంట కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నాసిరకం మద్యంలో జగన్ లక్ష కోట్లు కమిషన్ కొట్టేశాడని ఆరోపించారు. అందుకే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారని పేర్కొన్నారు. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పాడని, అధికారంలోకి వచ్చిన వారంలో.. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా రూ.1000 పెంచుతానని హామీ ఇచ్చి మాట తప్పాడని, విద్యుత్ చార్జీలు పెంచనన్న హామీకి విరుద్ధంగా 9 సార్లు పెంచి.. రూ. 64 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపి మాట తప్పాడని మండిపడ్డారు.

ఇసుక సరఫరాపై మాట తప్పాడని, ఉచిత ఇసుకను రద్దు చేసి రూ. 50 వేల కోట్ల కుంభకోణం చేశాడని, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలకు అమ్మ ఒడి హామీపై మాట తప్పాడని, అమ్మ ఒడికి రూ.13,000 ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేస్తున్నాడని ఆరోపించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా.. దాన్ని జగన్ 9 లక్షలకే కుదించి 7 లక్షల మంది విద్యార్థులకు నష్టం చేశాడన్నారు. రైతు భరోసాకు రూ.12,500 హామీపై మాట తప్పాడని, రాష్ట్ర నిధుల నుండి రూ.7,500 మాత్రమే ఇస్తున్నాడని, కేంద్రం ఇచ్చే రూ. 6,000 తానే ఇచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానన్న హామీపై మాట తప్పాడని పైగా పెట్రోల్ రేట్లలో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. 25 లక్షల పక్కా ఇళ్లు ఉచితంగా నిర్మిస్తానన్న హామీపై మాట తప్పాడు. ఇంటి నిర్మాణాల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశాడు. సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు కుంభకోణం చేశాడని ఆరోపించారు. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒకే కుటుంబంపై రూ. 8 లక్షల భారం మోపాడని, ఇచ్చేది గోరంత, కొట్టేసేది కొండంతని విమర్శించారు. అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ లాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాలు రద్దు చేశాడన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు ఒక లక్ష కోట్లు దారి మళ్ళించాడని మండిపడ్డారు. ప్రశ్నించిన దళిత, బడుగు, బలహీన వర్గాల 1000 మందికిపైగా హత్యలు చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని, నేర పానలో ఐదు కోట్ల మంది బాధితులేనన్నారు. ప్రతిపక్షాల ఐక్యతతో జగన్ ఎన్నికల అక్రమాలు సాగవని ప్యాంట్లు తడుపుకుంటున్నారు. తన చుట్టూ ఉన్న వేలాదిమంది మాఫియాల ఆటలు సాగవని బెంబేలెత్తు తున్నారన్నారు.

ప్రజల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు చేసి జనాన్ని తరలించే ప్రయత్నం చేశారని, అయినా సభ వెలవెలబోయిందన్నారు. అందుకే మీడియాపై ఆంక్షలు పెట్టారని, జగన్ ది వాపే గానీ బలం కాదని తేలిపోయిందని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.

 

LEAVE A RESPONSE