హైదరాబాద్: హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు హెచ్ఎండిఏ అనుమతులను పునరుద్ధరించింది. ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదు.
2022 లోనే ఆదిత్య కేడియా రియల్టర్స్ కంపెనీకి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవుల గ్రామంలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చింది.
అయితే, మూసీ నది బఫర్ జోన్ ను ఆక్రమించి అక్కడ రిటైనింగ్ వాల్ ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీలు తేలింది. 2 ఆగస్టు 2023 నాడు ఆ సంస్థకు హెచ్ఎండిఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఆ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున 18 ఆగస్టు 2023న భవన నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. రిటైనింగ్ వాల్ ను తొలగించాలని ఆ సంస్థకు హెచ్ఎండిఏ ఆదేశశాలు జారీ చేసింది.
అనుమతులను రద్దు చేయడానికి సవాలు చేస్తూ ఆదిత్య సంస్థ హైకోర్టుకు వెళ్లింది. మరోసారి తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అనుసరించి 26 ఫిబ్రవరి 2024న అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆ సంస్థ రిటైనింగ్ వాల్ ను తొలగించినట్లు తేలింది.
అనుమతులను పునరుద్ధరించాలని 1 మార్చి 2024న హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులను పునరుద్దరించాల్సిన అనివార్యత ఏర్పడింది. 20 జూన్ 2024న అనుమతులను పునరుద్ధరిస్తూ హెచ్ఎండిఏ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, మంచిరేవుల గ్రామంలోని సర్వే నెంబరు 476/AA1, 476/ AA2 లోని 9.19 ఎకరాల విస్తీర్ణంలో 38 అంతస్తుల బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ 12 మే 2022న హెచ్ఎండిఏ కార్యాలయానికి ఆదిత్య సంస్థ దరఖాస్తు చేసింది.
ప్రతిపాదిత భూమికి సమీపంలో మూసీ నది ఉన్నట్లు గుర్తించి ఆ సంస్థను స్పష్టత అడగడం జరిగింది. 8 అక్టోబరు 2021న ఇరిగేషన్ శాఖ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎన్వోసీలను హెచ్ఎండిఏ కు సమర్పించింది.
ఆదిత్య కంపెనీ ప్రతిపాదనలను మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (MSB) కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత భవన నిర్మాణ అనుమతులను ఇవ్వడానికి నిర్దేశిత ఫీజు చెల్లించాలని ఆ సంస్థకు సూచించింది. నిర్ణీత ఫీజు చెల్లించిన తర్వాతే హెచ్ఎండిఏ 19 ఆగస్టు 2022న భవన నిర్మాణ అనుమతులను జారీ చేసింది.