Suryaa.co.in

Andhra Pradesh

రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం

– ప్రముఖుల చిత్రాలు-చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్
– ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన కేలండర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు.
కేలండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తుచేశారు. ‘సైమన్ గో బ్యాక్’ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్ర్య ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
శ్రీ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయసహకారాలు అందించారని కీర్తించారు. అలాగే శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన – శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు.

రాజ్యాంగంలో కీలక సూచనలు :

శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ జాతీయ భాష, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, మానవ అక్రమ రవాణాపై చేసిన కీలక సూచనలను రాజ్యాంగ సభ ఆమోదించిందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీ మోటూరి సత్యనారాయణ జాతీయ భాష గురించి విలువైన సలహాలిచ్చారని, మరో ప్రముఖుడు శ్రీ గోగినేని రంగనాయకులు(ఎన్జీ రంగా) రాజ్యాంగంలో అధికార వికేంద్రీకరణ, అత్యవసర అధికారాలు, రెండు సభలు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై పలు సూచనలు చేశారని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రజాస్వామ్యం ప్రతిబింబించేలా కృషి :

భూ సేకరణకు నష్ట పరిహారం చెల్లించేలా నిబంధన తీసుకురావడంతో పాటు పాఠశాలలు, దేవాలయాల్లో ఎక్కడా వివక్ష ఉండకూడదని మతం, జాతి, కులం, లింగం ఆధారంగా నిరాదరణ చూపించకుండా నిబంధన రూపొందించాలని శ్రీ వీసీ కేసవరావు రాజ్యాంగసభలో ప్రతిపాదించారని ముఖ్యమంత్రి చంద్రబుబు తెలిపారు. డ్రాఫ్టింగ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, ప్రాథమిక హక్కులపై సబ్-కమిటీతో సహా తొమ్మిది కమిటీలలో శ్రీ అల్లాడి కృష్ణస్వామి భాగస్వామిగా ఉన్నారని; పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఎమర్జెన్సీ నిబంధనలపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. రాజ్యాంగంలో మహాత్మా గాంధీ ఆలోచనలు ప్రతిబింబించేలా శ్రీ మొసలికంటి తిరుమలరావు కృషి చేస్తే.. ఆస్తి హక్కు, జమీందారీ వ్యవస్థ రద్దు గురించిన చర్చలో శ్రీ కళా వెంకటరావు ప్రముఖంగా పాల్గొన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రముఖుల స్మరణ సంతోషంగా ఉంది

నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణరంగారావు రాజ్యాంగ రూపకల్పనలో అందించిన సహకారాన్ని మరువలేమని ముఖ్యమంత్రి అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులను – దార్శనికులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యాంగ రచనలో అద్వితీయమైన సేవలందించిన తెలుగు ప్రముఖులు కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అల్లాడి కృష్ణస్వామి, కల్లూరు సుబ్బారావు, కళా వెంకట రావు, ఆచార్య ఎన్ జీ రంగా, మొసలికంటి తిరుమల రావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు, మోటూరి సత్యనారాయణ, దుర్గాబాయి దేశ్ ముఖ్, నీలం సంజీవ రెడ్డి, వి సి కేశవ రావు ల చిత్ర పటాలతో పాటు, ఆనాడు సభలో వారు చేసిన ప్రసంగాంశాలను లభ్యమైన మేరకు ఈ కేలెండర్లో పొందుపరచారు.

ఇక సామాజిక మాధ్యమాల్లో శాసన వ్యవస్థ సమాచారం

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ప్రారంభించారు. ‘ఎక్స్’, యూట్యూబ్‌లో @LegisAndhra ద్వారానూ; ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో @legisandhra ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తుంది.

సభా కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని చంద్రబాబు అన్నారు. సామాజిక మాధ్యమాలు కేవలం సమాచారం కోసమే కాకుండా చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలని, సమాజంలో అవగాహన పెంచడానికి తోడ్పడాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. సవాళ్లను స్వీకరించి, శాసనవ్యవస్థ చేపట్టిన వినూత్న ప్రయత్నాలకు మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘు రామకృష్ణ రాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.

LEAVE A RESPONSE